ఆ దేశంలో ఓ ఫ్యాక్టరీ నిర్లక్ష్యం.. అంచనాలకందని నష్టం

2020 మీద ఎన్నో మంచి అంచనాలు పెట్టుకుంటే.. చరిత్రలో ఎప్పటికీ మరిచిపోలేని విషాదాల్ని మిగులుస్తోంది. ఈ ఏడాది ఆరంభంలో విస్తరించడం మొదలుపెట్టిన కరోనా మహమ్మారి ఇప్పుడు ప్రపంచాన్ని ఎలా గడగడలాడిస్తోందో తెలిసిందే. బహుశా ప్రపంచ చరిత్రలోనే అత్యంత ఎక్కువ మందిని ప్రభావితం చేసిన అంశం ఇదే కావచ్చు.

దీని బారి నుంచి ఎప్పుడు బయటపడుతామో తెలియట్లేదు. లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. దీని వల్ల వందల కోట్ల మంది నష్టం చవిచూస్తున్నారు. ఈ బాధ చాలదన్నట్లు.. కరోనా ప్రభావంతో జరుగుతున్న వేరే ఉదంతాలు కూడా ప్రపంచ దేశాల్ని కష్టపెడుతున్నాయి. నష్టాల పాలు చేస్తున్నాయి. మన విశాఖపట్నంలో గ్యాస్ లీక్‌కు కారణం కూడా పరోక్షంగా కరోనానే.

ఈ మహమ్మారి కారణంగా రెండు నెలలు మూత పడి.. ఆ తర్వాత తెరుచుకున్న ఎల్జీ పాలిమర్స్ సంస్థలో మెయింటైనెన్స్ లోపం వల్ల స్టెరీన్ గ్యాస్ లీక్ అయింది. 12 మంది ప్రాణాలు కోల్పోయారు. వందల మంది అనారోగ్యం పాలయ్యారు.

ఇప్పుడు రష్యాలో ఇంతకుమించిన విషాదం చోటు చేసుకుంది. అక్కడ నోరిల్స్క్ అనే నగరంలో ఓ పవర్ ప్లాంటులో మెయింటైనెన్స్ లోపం వల్ల ఫ్యూయల్ ట్యాంక్ బద్దలైంది. దాన్నుంచి 20 వేల టన్నుల ఆయిల్ లీక్ అయింది. అది మొత్తం సమీపంలోని అంబర్‌నాయా నదిలో కలిసిపోయింది. ప్లాంటు నుంచి ఏడు కిలోమీటర్ల దూరం ఆ ఆయిల్ విస్తరించింది. 20 వేల టన్నుల ఆయిల్ లీక్ అంటే.. ఆషామాషీ విషయం కాదు.

ఈ ఆయిల్ లీక్ చుట్టు పక్కల జీవరాశిపై తీవ్ర ప్రభావం చూపుతుందని.. నష్టం అంచనాలకు అందని విధంగా ఉంటుందని అంటున్నారు పర్యావరణ వేత్తలు. మళ్లీ ఈ ప్రాంతంలో పర్యావరణం పూర్వ స్థితికి చేరడానికి పదేళ్లకు పైగా పడుతుందని.. ఆ లోపు అనేక దుష్పరిణామాలు చూస్తామని అంటున్నారు.

ఇదిలా ఉండగా.. నార్వేలో ఆల్టా అనే ప్రాంతంలో సముద్ర తీరంలో ఉన్న ఇళ్ల కింద ఉన్న భూభాగం అంతా కదిలిపోయి.. ఇళ్లతో సహా వెళ్లి సముద్రంలోకి కలిసిపోతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇవన్నీ చూసి 2020 మానవాళిపై ఇంతగా పగబట్టేసిందేంటూ ఆందోళన చెందుతున్నారు జనం.