బీజేపీ సీఎం అభ్యర్థిగా ఈటల?.. ఎందుకలా?

ఈటల రాజేందర్.. ప్రస్తుతం తెలంగాణా రాజకీయాల్లో మారుమోగిపోతున్న పేరిది. కేసీఆర్‌కు రాష్ట్రంలో ఎదురేలేదనుకుంటున్న సమయంలో.. ఆయన్ను ఎదిరించి, ఎన్నికల్లో నిలబడి విజయాన్ని అందుకున్న నేత ఈటల. ప్రస్తుతం అందరి దృష్టి ఆయనపైనే.. ప్రసంశలన్నీ ఆయనవే. ఈ సందర్భంగా ఈటల తదుపరి అడుగు ఏమై ఉంటుందనే ప్రశ్న సహజమే. దీనికి సమాధానంగా ప్రస్తుతం రాజకీయవర్గాల్లో ఓ ఆసక్తికర కథనం వైరల్ అవుతోంది. టీఆర్‌ఎస్ కొనసాగిన దొరకని అవకాశం..బీజేపీలో ఆయనను వరించబోతోందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్‌నే ఢీకొని నిలబడ్డ ఆయనను వచ్చే ఎన్నికల్లో ఏకంగా ముఖ్యమంత్రి అభ్యర్థిగా నిలబెట్టాలనే ఆలోచనలో బీజేపీ వర్గాలు ఉన్నట్టు తెలుస్తోంది.

హుజురాబాద్ ఎన్నికల్లో విజయం తర్వాత అటు వ్యక్తిగతంగా ఈటలకు ఇటు బీజేపీ ప్రతిష్టతను పెంచాయి. ఈ నేపథ్యంలోనే ఈటలను బీజేపీ శాసనసభాపక్ష నేత ఎన్నికునే అవకాశం ఉంది. ఇప్పటికే ఆ పార్టీకి రాజాసింగ్, రఘునందన్ రావు అసెంబ్లీలో బీజేపీ వాణి వినిపిస్తున్నారు. అయితే ఈ ఇద్దరితో పోల్చుకుంటే ఈటలకు సుదీర్ఘ రాజకీయ అనుభవం, ఉద్యమ నేపథ్యం, ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2014కు ముందు తెలంగాణ విభజన జరుగకముందు ఈటల టీఆర్‌ఎస్ శాసనసభాపక్ష నేతగా సమర్ధవంతంగా పనిచేశారు. అదువల్ల టీఆర్‌ఎస్ ను ఎదుర్కొవాలంటే ఈటలనే శాసనసభాపక్ష నేతగా ఎన్నుకోవాలని ఆ పార్టీ భావిస్తోంది.

వాస్తవానికి హుజురాబాద్ ఎన్నికలు ఈటల వర్సెస్ కేసీఆర్ గా జరిగాయి. అందువల్ల ఈటలను హుజురాబాద్ కే పరిమితం చేయకుండా రాష్ట్రవ్యాపితం చేయాలని బీజేపీ ప్రణాళికలు రచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. బీజేపీ శాసనసభాపక్ష నేతగానే కాకుండా 2023లో బీజేపీ సీఎం అభ్యర్థిగా ఈటలను ప్రమోట్ చేస్తారనే చర్చ ప్రారంభమైంది. వాస్తవానికి జాతీయ పార్టీల్లో వ్యక్తులు కేంద్రంగా రాజకీయాలు చేయవు. ఎన్నికలకు ముందే సీఎం అభ్యర్థులను ప్రకటించవు. అది కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా ఒకే విధానాన్ని అమలు చేస్తాయి. అయితే బీజేపీ మాత్రం కేరళ ఎన్నికల్లో మెట్రో శీధరన్ ను సీఎం అభ్యర్థిగా ప్రకటించి ఎన్నికల్లోకి దిగింది. ఇప్పుడు తెలంగాణలో కూడా ముందే సీఎం అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉందని విశ్లేషణలు ప్రారంభమయ్యాయి. మండల కమిషన్ అనంతరం రాజకీయాల్లో ఓబీసీల ప్రధాన్యం పెరుగుతూ వస్తోంది. కాలంతో పాటు బీజేపీ కూడా ఓబీసీ నేతలను ప్రొత్సహిస్తోంది. తెలంగాణలో బీసీలు అధికంగా ఉన్నారు. తెలంగాణలో బీసీలను ప్రభావం చేసే సామాజిక వర్గం ఈటలది. ఆయన సతీమణి జమునది.. రెడ్డి సామాజిక వర్గం, ఆ రెండు సామాజిక వర్గాల కాంబినేషన్ తో ముందుకు పోవాలని బీజేపీ లెక్కలేస్తోంది.

వీటన్నింటి కన్నా ఈటలకు టీఆర్‌ఎస్ నేతలతో పాటు కాంగ్రెస్ నేతలతో కూడా మంచి సంబంధాలున్నాయి. ఆయన టీఆర్‌ఎస్ నుంచి బయటకు వచ్చాక ముందుగా కాంగ్రెస్ నేతలతోనే సంప్రదింపులు జరిపారని అప్పట్లో ప్రచారం జరిగింది. అంతేకాకుండా టీఆర్‌ఎస్ లోని చాలా మంది మంత్రులు ఎమ్మెల్యే ఆయన టచ్‌ లో ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు రెండేళ్లు సమయం ఉంది. ఈ లోపు టీఆర్‌ఎస్ లో కేసీఆర్ ఎదరించి, స్వంత బలంతో అంటే… ఈటలలాగే గెలిచే నేతలను బీజేపీలో చేర్చుకోవాలనే ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ముందస్తు ఎన్నికలతో కాంగ్రెస్ ను కేసీఆర్ ఏ విధంగా బేజారెత్తించారో అదే విధంగా ఇప్పుడు బీజేపీ కూడా టీఆర్‌ఎస్ ను బేజారెత్తించేందుకు సన్నాహాకాలు చేస్తోందని చెబుతున్నారు. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను బీజేపీలోకి చేర్చుకుని కేసీఆర్ ను మానసికంగా దెబ్బతీయాలనే వ్యూహంతో కాషాయపార్టీ ముందుకు పోతోందని చెబుతున్నారు.

ఈటల ఉద్యమ నేత కావడంతో పాటు ఆయన ఆర్థిక మంత్రిగా పనిచేశారు. అందువల్ల రాష్ట్ర ఆర్థిక మూలాలపై ఆయనకు పట్టు ఉంది. ప్రజలతో కలుపుగోలుగా ఉండటం, పార్టీ శ్రేణులను బలోపేతం లాంటి అంశాలు ఈటలకు అదనంగా కలిసివచ్చే విషయాలు. కేసీఆర్‌ను ఢీకొట్టే సత్తా బీజేపీలో ఈటలకే ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఏడుసార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు మంత్రిగా పనిచేసిన అనుభవం కూడా ఈటలకు ఉంది. రాజకీయ విలువలు, నిబద్ధతతో కూడిన నేతగా ఆయనకున్న ఇమేజ్ బీజేపీకి కచ్చితంగా కలిసి వస్తుందని బీజేపీ అంచనా వేస్తోంది. అందువల్ల ఈటలను ముఖ్యమంత్రి అభ్యర్థిగా బీజేపీ ప్రకటించే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ముందుగానే ఈటలను సీఎం అభ్యర్థిగా బీజేపీ ప్రకటిస్తే… ఆ పార్టీకి ఎంతో ఉపయోగంగా ఉంటుందని పలువురు భావిస్తున్నారు. అధికారంలోకి వచ్చినా.. రాకపోయినా ఆశించిన స్థాయిలో బీజేపీ మంచి ఫలితాలు వస్తాయని బీజేపీ ధీమా వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈటల వల్ల రాబోయే రోజుల్లో బీజేపీకి లాభమే తప్పా నష్టం ఉండదని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.