నిర్మలమ్మపై వేటు తప్పదా?

కేంద్ర ప్రభుత్వంలో అత్యంత కీలకమైన శాఖల్లో ఆర్థిక శాఖ ఒకటి. ఏ ప్రభుత్వం ఏర్పాటైనా.. ఆర్థిక శాఖను నిపుణులు, పెద్ద స్థాయి నాయకులకే అప్పగిస్తారు. మోడీ సర్కారు అధికారంలోకి వచ్చాక భారతీయ జనతా పార్టీ అగ్ర నేతల్లో ఒకరైన అరుణ్ జైట్లీ ఆ శాఖను చేపట్టారు. ఐతే ఆయన అనారోగ్యం పాలై తుది శ్వాస విడవడంతో ఆయన స్థానాన్ని భర్తీ చేయడం మోడీ అండ్ కోకు కష్టమే అయింది. మంచి వక్తగా పేరు తెచ్చుకుని రెండేళ్ల పాటు రక్షణ శాఖ బాధ్యతలు చూసిన తెలుగింటి కోడలు నిర్మలా సీతారామన్‌కు గత ఏడాది ఆర్థిక శాఖను అప్పగించారు మోడీ. ఐతే ఎన్నో అంచనాల మధ్య ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఆమె.. ఆ అంచనాలకు తగ్గట్లు పని చేయలేకపోయారు. వివిధ సందర్భాల్లో నిర్మల అవగాహన లేమి బయటపడిపోయింది. ఆమె ప్రమేయం ఎంత ఉందన్నది పక్కన పెడితే.. నిర్మల ఆర్థిక మంత్రిగా ఉండగానే ఆర్థిక వ్యవస్థ గాడి తప్పింది. జీడీపీ పడిపోతూ వచ్చింది.

ఉన్న కష్టాలు చాలవన్నట్లు కరోనా మహమ్మారి ధాటికి భారత ఆర్థిక వ్యవస్థ కుదేలై గత కొన్నేళ్లలో ఎన్నడూ చూడని పతనాన్ని చూస్తోంది. ఈ నేపథ్యంలో నిర్మల తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఆమెను ఆర్థిక మంత్రిగా తప్పించాలన్న డిమాండ్లు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ఈ డిమాండ్లకు మోడీ తలొగ్గినట్లే చెబుతున్నారు. కేంద్రంలో రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఏడాది పూర్తయిన నేపథ్యంలో మోడీ మంత్రి వర్గ పునర్‌వ్యవస్థీకరణకు రెడీ అయ్యారు.

ఆయన కచ్చితంగా మార్చాలని చూస్తున్న శాఖల్లో ఆర్థిక శాఖ ఒకటని సమాచారం. ప్రస్తుత సంక్షోభ సమయంలో స్వతంత్రంగా ముఖ్య నిర్ణయాలు తీసుకుని ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టే సత్తా నిర్మలకు లేదని భావించి ఓ ఆర్థిక నిపుణుడిని ఆమె స్థానంలోకి తేవాలని మోడీ నిర్ణయించారట. ఆ వ్యక్తి కేవీ కామత్ అని సమాచారం. ప్రస్తుతం ఆయన బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా కూటమి (బ్రిక్స్) బ్యాంకు ఛైర్మన్‌గా పని చేస్తున్నారు. ఆర్థిక అంశాలతో సంబంధం ఉన్న మిగతా మంత్రుల్ని కూడా మోడీ మార్చబోతున్నారని అంటున్నారు. ఐతే నిర్మలపై వేటు వేసినా.. ఆమెకు మరో మంత్రిత్వ శాఖను అప్పగించే అవకాశముంది.