చేరిక‌లు.. ప్ర‌చారాలు.. సంద‌డి షురూ!

ప్ర‌త్య‌ర్థి పార్టీల నాయ‌కుల‌ను ఆక‌ర్షించ‌డం.. త‌మ ప్ర‌యోజ‌నాల కోసం నేత‌లు పార్టీలు మార‌డం.. హోరాహోరీ ప్ర‌చారం.. సెల‌బ్రిటీల చేరిక‌లు.. ఇలా దేశ‌వ్యాప్తంగా అయిదు రాష్ట్రాల్లో ఇప్ప‌టి నుంచే ఎన్నిక‌ల సంద‌డి మొద‌లైపోయింది. వ‌చ్చే ఏడాది కీల‌క‌మైన ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌తో పాటు పంజాబ్, గోవా, మ‌ణిపూర్‌, ఉత్త‌రాఖండ్ రాష్ట్ర శాస‌న‌స‌భ‌ల‌కు ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఆ ఎన్నిక‌ల‌కు మ‌రికొద్ది నెల‌ల స‌మ‌యం మాత్ర‌మే ఉంది. ఈ నేప‌థ్యంలో ప్ర‌ధాన జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌తో పాటు ఆయా రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలు ఇప్ప‌టి నుంచే ఆ ఎన్నిక‌ల్లో విజ‌యం కోసం క‌స‌ర‌త్తులు మొద‌లెట్టేశాయి. ఆ దిశ‌గా వ్యూహాలు, ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్నాయి.

కేంద్రంలో అధికారంలోకి రావాల‌నుకునే పార్టీల‌కు ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌లు ఎంతో కీల‌క‌మైన‌వి. దేశంలోనే అత్య‌ధికంగా 403 అసెంబ్లీ స్థానాలు ఉండ‌డంతో అన్ని పార్టీలు అక్క‌డ విజ‌యం కోసం తీవ్రంగానే పోరాడ‌తాయి. ప్ర‌స్తుతం అక్క‌డ అధికారంలో ఉన్న బీజేపీ వచ్చే ఎన్నిక‌ల్లోనూ జెండా ఎగ‌రేయాల‌నే ప‌ట్టుద‌ల‌తో ఉంది. మ‌రోవైపు ఈ రాష్ట్రంలో అధికారం సాధించి కేంద్రంలో గద్దెనెక్కే దిశ‌గా అడుగులు వేయాల‌ని కాంగ్రెస్ గ‌ట్టిగానే ప్ర‌య‌త్నిస్తోంది.

మ‌రోవైపు ఆ రాష్ట్రంలో పాగా కోసం స‌మాజ్‌వాదీ పార్టీ శాయాశ‌క్తులా కృషి చేస్తోంది. అందులో భాగంగానే ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేసుకుంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లోపు పార్టీని బ‌లోపేతం చేసే దిశ‌గా అధ్యక్షుడు అఖిలేశ్ యాద‌వ్ అడుగులు వేస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే తాజాగా యూపీలో ఏడుగురు ఎమ్మెల్యేలు అఖిలేశ్ స‌మ‌క్షంలో స‌మాజ్‌వాదీ పార్టీలో చేరారు. అందులో ఒక‌రు అధికార బీజేపీ ఎమ్మెల్యే కాగా.. మిగ‌తా ఆరుగురు బ‌హుజ‌న్ స‌మాజ్ పార్టీ శాస‌న‌సభ్యులు. పార్టీకి వ్య‌తిరేక బావుటా ఎగ‌రేయ‌డంతో ఆ ఆరుగురిపై బీఎస్పీ పార్టీ వేటు వేసినట్లు తెలుస్తోంది.

మ‌రోవైపు దేశంలో బీజేపీకి ప్ర‌త్యామ్నాయంగా ఎద‌గాల‌ని భావిస్తున్న తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మ‌మ‌తా బెన‌ర్జీ అందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్ప‌టివ‌ర‌కూ కేవ‌లం ప‌శ్చిమ బెంగాల్‌కే ప‌రిమిత‌మైన ఆమె.. ఇప్పుడు ఇత‌ర రాష్ట్రాల్లోనూ పార్టీని విస్త‌రించే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఆమె గోవాపై ప్ర‌త్యేక దృష్టి సారించారు. తాజాగా టెన్నిస్ దిగ్గ‌జం లియాండ‌ర్ పేస్‌ను గోవాలోనే పార్టీలో చేర్చుకున్న ఆమె.. అక్క‌డ మూడు రోజుల ప‌ర్య‌టించి పార్టీ శ్రేణుల‌ను వ‌చ్చే ఎన్నిక‌ల కోసం సిద్ధం చేశారు. ఇక దేశంలో తిరిగి పున‌ర్వైభ‌వం సాధించాల‌నే ధ్యేయంతో ఉన్న కాంగ్రెస్ కూడా ఈ ఎన్నిక‌ల‌ను ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తీసుకుంది. ఆ పార్టీ అగ్ర నాయ‌కుడు రాహుల్ గాంధీ ఇప్ప‌టి నుంచే గోవాలో ప్ర‌చారం మొద‌లెట్టారు. ఇలా మొత్తానికి ఎన్నిక‌ల‌కు కొన్ని నెల‌ల ముందు నుంచే ఆ సంద‌డి ప్రారంభమైంద‌నే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.