పట్టాభిరామ్ నేపథ్యం తెలుసా?

పట్టాభిరామ్.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన పేరు. తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధుల్లో ఒకరిగా కొన్నేళ్లుగా చాలా బలంగా వాయిస్ వినిపిస్తున్న వ్యక్తి ఇతను. వైసీపీ సర్కారు అధికారంలోకి వచ్చాక టీడీపీ నుంచి పట్టాభిరామ్ స్థాయిలో ఇంత బలంగా పార్టీ గళాన్ని వినిపించిన నాయకుడు మరొకరు లేరు అంటే అతిశయోక్తి కాదు. ఏ అంశం మీద అయినా.. బాగా స్టడీ చేసి, ఆధారాలు పక్కన పెట్టుకుని మాట్లాడాడని, ఆరోపణలు చేస్తారని ఆయనకు పేరుంది.

ఐతే ఘాటు విమర్శలు చేస్తారు కానీ బూతుల జోలికి ఎప్పుడూ పెద్దగా వెళ్లింది లేదు. కానీ తాజాగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి ‘బోసిడీకే’ అనే పదం వాటడంతో ఆయన వార్తల్లో వ్యక్తిగా మారారు. పట్టాభిరామ్ వ్యాఖ్యలకు ప్రతిగా వైసీపీ శ్రేణులు టీడీపీ కార్యాలయాలు, పట్టాభిరామ్ ఇంటిపై దాడులు చేయడం.. ఆ తర్వాత పట్టాభిరామ్ మీద కేసులు పెట్టి పోలీసులు అరెస్టు చేయడం చర్చనీయాంశమైంది. పట్టాభిరామ్ పుణ్యమా అని ‘బోసిడీకే’ అనే పదం సోషల్ మీడియాలో చర్చనీయాంశం అయింది. ఆ పదానికి అర్థమేంటో తెలుసుకునే పనిలో నెటిజన్లు బిజీగా ఉన్నారు.

ఈ సంగతలా ఉంచితే ఈ పట్టాభిరామ్ నేపథ్యం ఏంటన్నది కూడా ఇప్పుడు అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది. కొంచెం లేటు వయసులోనే రాజకీయాల్లోకి వచ్చిన పట్టాభిరామ్ అంతకుముందు హోటలియర్‌గా చాలా ఏళ్లు ఆ రంగంలో పని చేశారు. హోటల్ మేనేజ్మెంట్ డిగ్రీ తర్వాత ఒబెరాయ్, ఛాయిస్ ఇంటర్నేషనల్ లాంటి ప్రఖ్యాత హోటళ్లలో పని చేశారు. ఆ తర్వాత సొంతంగా రెస్టారెంట్లు మొదలుపెట్టి అందులో ఎదిగారు. చాలా ఏళ్ల పాటు పట్టాభిరామ్ హోటల్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. స్టార్ హోటళ్లకు రేటింగ్స్ ఇచ్చే క్లాసిఫికేషన్ కమిటీలోనూ చాలా ఏళ్లు పట్టాభిరామ్ పని చేశారు. హోటల్ టూరిజం అవార్డులిచ్చే కమిటీలోనూ జ్యూరీ సభ్యుడిగా ఉన్నారు.

2011లో 38.2 అడుగుల దోసె తయారీతో గిన్నిస్ రికార్డు సాధించిన టీంలో పట్టాభిరామ్ సభ్యుడిగా ఉండటం విశేషం. వ్యాపారంలో ఒక స్థాయి అందుకున్నాక రాజకీయాల్లోకి అడుగు పెట్టి త్వరగానే టీడీపీ అధికార ప్రతినిధి హోదానందుకున్నారు. స్పోక్స్ పర్సన్ అయ్యాక కూడా చాలా వేగంగానే పేరు సంపాదించారు.