వైసీపీ నేతల నుంచి రంగుల ఖర్చు రాబట్టాలి: చంద్రబాబు

ప్రభుత్వ భవనాలకు రంగుల తొలగింపు వ్యవహారంలో ఏపీ సర్కార్ కు సుప్రీం కోర్టులో చుక్కెదురైన సంగతి తెలిసిందే. నాలుగు వారాల్లోపు ప్రభుత్వ భవనాలకు రంగులు తొలగించాలని, లేదంటే కోర్టు ధిక్కరణ కింద పరిగణిస్తామని దేశపు అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈ తీర్పుపై ఏపీ ప్రతిపక్ష నేత, టీడీపీ జాతీయాధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. ప్రభుత్వ కార్యాలయాలకు, ఆస్తులకు వైసీపీ జెండా రంగులు వేయడం సరికాదని, ఈ విషయంలో ప్రభుత్వానికి సుప్రీం కోర్టు మొట్టికాయలు వేయడం సిగ్గుచేటని చంద్రబాబు విమర్శించారు. హైకోర్టు చెప్పిన తర్వాత కూడా సుప్రీం కోర్టుకు ప్రభుత్వం వెళ్లిందని, రాజ్యాంగం అన్నా, కోర్టులన్నా వైసీపీ పాలకులకు ఏ మాత్రం గౌరవం లేదని చంద్రబాబు విమర్శించారు. కొట్టేస్తారని తెలిసి కూడా కొత్త జీవోలు జారీ చేస్తున్నారని దుయ్యబట్టారు. హైకోర్టు , సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించకుండా…కోర్టు ధిక్కరణ ఎదుర్కొనే పరిస్థితిని కొని తెచ్చుకుంటున్నారని విమర్శించారు. హైకోర్టు ఆదేశాలను ధిక్కరించిన వైసీపీ నేతల నుంచే రంగుల ఖర్చును రాబట్టాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.

కాగా, ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ జెండా రంగులు వేసిన వ్యవహారంపై సుప్రీంకోర్టులోనూ ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురైంది. రంగులు తొలగించాల్సిందేనని హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఆ పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీం కోర్టు దానిని కొట్టివేసింది. ప్రభుత్వ భవనాలు, కార్యాలయాలకు వేసిన రంగులను నాలుగు వారాల్లో తొలగించాలని జగన్ సర్కార్‌ను ఆదేశించింది. 4 వారాల్లోగా ప్రభుత్వ కార్యాలయాలకు రంగులు తొలగించకపోతే కోర్టు ధిక్కరణ కింద చర్యలు తీసుకోవాల్సి వస్తుందని ఏపీ ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు హెచ్చరించింది. ఓ వైపు ఏపీ మాజీ ఎస్ ఈసీ నిమ్మగడ్డ వ్యవహారంలోనూ ఏపీ హైకోర్టులో జగన్ సర్కార్ కు చుక్కెదురైన సంగతి తెలిసిందే.