ఏపీలో రాష్ట్ర‌ప‌తి పాల‌న‌.. సాధ్య‌మేనా?

టీడీపీ అధినేత చంద్ర‌బాబు కోరిక నెర‌వేరుతుందా? ఏపీలో రాష్ట్ర‌ప‌తి పాల‌న పెడ‌తారా? కేంద్రం దీనికి స‌మ్మ‌తిస్తుందా? ఇదీ.. ఇప్పుడు ఆస‌క్తిగా మారిన చ‌ర్చ‌. రాష్ట్రంలో ఏ ఇద్ద‌రు క‌లిసినా.. దీనిపైనే చ‌ర్చ చేసు కుంటున్నారు. టీడీపీ ఆఫీస్‌పై జ‌రిగిన దాడి నేప‌థ్యంలో రాష్ట్రంలో శాంతి భ‌ద్ర‌త‌లు అదుపు త‌ప్పాయ‌ని.. గంజాయి కేంద్రంగా ఏపీ మారిపోయింద‌ని.. మాద‌క ద‌వ్యాల ర‌వాణాకు అడ్డాగా మారింద‌ని.. ఇది రాష్ట్రాన్ని, దేశాన్ని కూడా నాశ‌నం చేస్తోంద‌ని.. అందుకే ఏపీలో రాష్ట్ర‌ప‌తి పాల‌న విధించాల‌ని.. చంద్ర‌బాబు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్‌, ప్ర‌ధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. వంటివారికి 39 పేజీల‌తో కూడిన లేఖ లు రాశారు.

ఇక‌, ఈ క్ర‌మంలోనే కార్యాల‌యంపై జ‌రిగిన దాడి వేడి త‌గ్గిపోకుండా.. 36 గంట‌ల దీక్ష‌కు కూర్చున్నారు చంద్ర‌బాబు. మొత్తంగా ఇప్పుడు టీడీపీ అధినేత చంద్ర‌బాబు చేస్తున్న డిమాండ్‌.. రాష్ట్రంలో ఆర్టిక‌ల్ 356ను అమ‌లు చేయాలి.. రాష్ట్ర‌ప‌తి పాల‌న పెట్టాలి.. అనే! అయితే.. రాజ్యాంగంలో పేర్కొన్న ఆర్టిక‌ల్ 356 మేర‌కు రాష్ట్రాల్లో రాష్ట్ర‌ప‌తి పాల‌న ఎప్పుడు విధిస్తారు? దీనికి దారితీసే ప‌రిస్థితి ఏంటి? అనేది.. చూద్దాం.

ఏదైనా రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని సస్పెండు చేసి లేదా రద్దుచేసి, రాష్ట్రాన్ని నేరుగా కేంద్ర ప్రభుత్వ పాలనలోకి తీసుకురావడాన్ని రాష్ట్రపతి పాలన అంటారు. భారత రాజ్యాంగం లోని 356 వ అధికరణం ప్రకారం కేంద్ర ప్రభుత్వానికి ఈ అధికారం సంక్రమించింది. దీని ప్రకారం, రాజ్యాంగ యంత్రాంగం వైఫల్యం చెందిందని భావించినపుడు, దేశంలోని ఏ రాష్ట్రంలోనైనా రాష్ట్రపతి పాలనను విధించవచ్చు. రాష్ట్రంలోని పరిస్థితిపై గవర్నరు ఇచ్చిన నివేదికపై ఆధారపడి కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటుంది.

రాష్ట్రపతి పాలన అమల్లో ఉండగా, రాష్ట్రపతి ప్రతినిధిగా రాష్ట్ర గవర్నరు పరిపాలనా బాధ్యతలు నిర్వహిస్తారు. ఈ బాధ్యతల్లో భాగంగా గవర్నరు తనకు సహాయపడేందుకు అధికారులను నియమించుకోవచ్చు. రాష్ట్రపతి పాలనలో ఉండగా, మంత్రివర్గాన్ని రద్దు చేస్తారు. ముఖ్యమంత్రి ఉండరు. శాసనసభ సమావేశాలను వాయిదా (ప్రోరోగ్) వేస్తారు లేదా రద్దు చేస్తారు. అయితే.. 1994లో ఎస్సార్ బొమ్మై కేసులో ఇచ్చిన తీర్పులో సుప్రీమ్‌ కోర్టు, ఇచ్చిన తీర్పులో రాష్ట్రపతి పాలన విధించేందుకు కొన్ని నియ‌మాలు విధించింది. ఎలా ప‌డితే.. అలా రాష్ట్ర‌ప‌తి పాల‌న విధించి.. ప్ర‌జ‌లు ఎన్నుకొన్న ప్ర‌భుత్వాన్ని ర‌ద్దు చేసేందుకు సుప్రీం కోర్టు అంగీక‌రించ‌లేదు.

ఏదైనా రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య తలెత్తినపుడు, ప్ర‌జాందోళనలు జరిగినపుడు రాష్ట్ర ప్రభుత్వం అదుపు చెయ్యలేకపోతే, దేశ ఐక్యతను, సమగ్రతనూ కాపాడేందుకు 356 అధికరణం కేంద్ర ప్రభుత్వానికి అనేక అధికారాలను ఇచ్చింది. 1950 లో రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టాక, రాష్ట్ర ప్రభుత్వాలను రద్దు చేసేందుకు కేంద్రం ఈ అధికరణాన్ని అనేక మార్లు ఉపయోగించింది. 1954లో ఉత్తర ప్రదేశ్‌లో మొదటిసారిగా ఈ అధికరణాన్ని ప్రయోగించారు. 1970, 1980లలో, దీన్ని ఉపయోగించడం మామూలై పోయింది. 1966, 1977 మధ్య ఇందిరా గాంధీ 39 సార్లు ఈ అధికరణాన్ని ప్రయోగించగా, జనతా పార్టీ తన రెండున్నరేళ్ళ పాలనలో 9 సార్లు ప్రయోగించింది.

ఎస్సార్ బొమ్మై కేసులో సుప్రీం కోర్టు 1994లో ఇచ్చిన తీర్పులో రాష్ట్రపతి పాలన విధింపుపై నియంత్రణలు విధించిన తర్వాత మాత్రమే ఇది తగ్గింది. 2000 తర్వాత రాష్ట్రపతి పాలన విధింపు బాగా తగ్గిపోయింది. భారత సమాఖ్య వ్యవస్థపై జరిగే చర్చలో 356 అధికరణం ఎప్పుడూ ఒక ముఖ్య అంశమే. కేంద్ర రాష్ట్ర సంబంధాలపై 1983 లో సర్కారియా కమిషను ఇచ్చిన నివేదికలో 356 అధికరణాన్ని “తక్కువగా, అత్యంత తీవ్రమైన సందర్భాల్లో మాత్రమే, రాజ్యంగ వ్యవస్థలను పునస్థాపించేందుకు అవసరమైన అన్ని వికల్పాలనూ ప్రయత్నించాక, చిట్టచివరి ప్రత్యామ్నాయంగా మాత్రమే ప్రయోగించాల”ని పేర్కొంది.

సో.. ఇప్పుడు ఏపీలో ఆర్టిక‌ల్ 356 ప్ర‌కారం.. రాష్ట్ర‌ప‌తి పాల‌న విధించేందుకు ఎలాంటి అవ‌కాశం క‌నిపించ‌చ‌డం లేద‌ని.. అంటున్నారు ప‌రిశీల‌కులు. ఎందుకంటే.. ఇటీవ‌లే.. కేంద్ర ప్ర‌భుత్వం రాష్ట్ర పోలీసులు బాగా ప‌నిచేస్తున్నార‌ని.. రాష్ట్రంలో శాంతిభ‌ద్ర‌త‌ల‌కు ఎలాంటి ముప్పు వాటిల్ల‌లేద‌ని.. కితాబునిచ్చింది. కొన్ని అవార్డులు కూడా ఇచ్చింది. ఇక‌, రాష్ట్ర బీజేపీ నేత‌లు కూడా కేంద్రానికి ఈ విష‌యంలో ఎలాంటి ఫిర్యాదులూ చేసే అవ‌కాశం లేదు. వీట‌న్నింటిక‌న్నా ముఖ్యంగా గ‌వ‌ర్న‌ర్ నివేదిక కీల‌కం. ఆయ‌న కూడా ప్ర‌భుత్వానికి సానుకూలంగా ఉన్నారు. ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. చంద్ర‌బాబు కోరిక నెర‌వేరే ప్ర‌శ్న లేద‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు.