ఎమ్మెల్యే రోజా పొరపాటు చేసిందా ?

నిజమైన రాజకీయ నేతలెవరు తాత్కాలిక ప్రయోజనాల కోసం పాకులాడరు. అలాగే ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన వాళ్ళదే అంతిమ విజయం అని తెలుసుకోవాలి. ఇదంతా ఎవరి విషయంలో అంటే నగరి వైసీపీ ఎంఎల్ఏ రోజా విషయంలోనే. కొద్దిరోజులుగా రోజాను ఇబ్బందిపెడుతున్న నిండ్ర మండల ప్రజా పరిషత్ అధ్యక్ష పదవిని ఎలాగైతేనేమి తన మద్దతుదారుకే ఇప్పించుకున్నారు. కాస్త ఆలస్యమైనా తన మద్దతుదారు దీపకే ఎంపీపీ పదవి వచ్చేట్లు చేసుకున్న రోజా చాలా హ్యాపీగా ఫీలవుతున్నారు.

ఎందుకంటే తన పంతమే నెగ్గిందని రోజా తెగ సంబరపడిపోతున్నారు. నిండ్ర మండలంలోని 8 ఎంపీటీసీల్లో ఏడింటిని వైసీపీనే గెలుచుకుంది. గెలిచిన వాళ్ళల్లో రోజా మద్దతుదారులు దీప కూడా ఉన్నారు. అయితే రోజా వ్యతిరేకవర్గమైన ఆరుగురు చక్రపాణి మద్దతుదారులు దీపను ఎంపీపీగా అంగీకరించలేదు. దాంతో నగిరిలో రెండువర్గాల మధ్య పెద్ద వివాదం రేగింది. ఒకరిపై మరొకరు ఫిర్యాదులు, పంచాయితీలు అయిన తర్వాత చివరకు అగ్రనాయకత్వం జోక్యం చేసుకోవాల్సొచ్చింది.

ఎలాగైతేనేమి చివరకు రోజా మద్దుతుదారైన దీపకే మండలాధ్యక్ష పదవి దక్కింది. నిజానికి రోజా ఈ విషయంలో ఇంతగా పట్టుబట్టాల్సిన అవసరమే లేదు. ముందుగానే వ్యవహారమేంటో గ్రహించి అందుకు తగ్గట్లుగా తెరవెనుక నుండి చక్రం తిప్పుంటే సరిపోయేది. కానీ రోజా అలా చేయకుండా తన ప్రత్యర్ధి వర్గంతో బహిరంగంగా ఢీ అంటే ఢీ అన్నారు. దీంతో రోజా తన స్ధాయిని తానే తగ్గించుకున్నట్లయ్యింది. సరే దీంతో వ్యవహారమంతా సెటిల్ అయిపోయిందని అనుకుంటే పొరబాటే.

ఎలాగంటే రోజాపై ఇప్పటికే రెండు బలమైన వర్గాలు కత్తులు నూరుతున్నాయి. మొదటి ప్రత్యర్ధేమో నగిరి మున్సిపల్ ఛైర్మన్ గా చేసిన కేజే కుమార్, శాంతి దంపతులు. తాజాగా రెండో ప్రత్యర్ధేమో రెడ్డివారి సోదరులు. నగిరి మున్సిపాలిటి పరిధిలో కేజే కుమార్ దంపతులు, నిండ్ర మండలం పరిధిలో రెడ్డి వారి చక్రపాణిరెడ్డి, భాస్కరరెడ్డి బలమైన నేతలు. వీళ్ళిద్దరు గనుక రోజాకు వ్యతిరేకంగా ఏకమైతే ఎంఎల్ఏకి చుక్కలు కనబడటం ఖాయమే. ఇప్పటికిప్పుడు ఏమీ అయిపోలేదు మరో రెండున్నరేళ్ల తర్వాత రాబోయే అసెంబ్లీ ఎన్నికలే రోజాకు అసలైన సవాలు.

తన వ్యతిరేక గ్రూపులను కాదని రోజా గెలవటం అంత ఈజీ కాదు. పైగా వీరిద్దరు వచ్చే ఎన్నికల్లో నగిరి టికెట్ ను ఆశిస్తున్నారు. రోజా గనుక హ్యాట్రిక్ ఎంఎల్ఏ అనిపించుకోవాలంటే అర్జంటుగా రెండు గ్రూపులతో సయోధ్య చేసుకోవాల్సిందే. జగన్మోహన్ రెడ్డితోనో లేకపోతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితోనో చెప్పుకుని వాళ్ళతో సయోధ్య చేసుకోకపోతే గెలుపుపై నమ్మకం పెట్టుకోవటం కష్టమే. ఎంపీపీ పదవి కోసమని రెడ్డివారి సోదరులతో పెద్ద గొడవ పెట్టుకోవటం అంటే తన ఎమ్మెల్యే సీటుకు ఎసరు పెట్టుకోవడమే.