కేసీఆర్ ముంద‌స్తు వ్యూహాలు

KCR

తెలంగాణ ప్ర‌త్యేక రాష్ట్రం ఏర్ప‌డ్డ త‌ర్వాత 2014 ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించి కేసీఆర్ తొలిసారి సీఎం అయ్యారు. రాష్ట్ర సాధ‌న కోసం ఉద్య‌మించిన పార్టీగా టీఆర్ఎస్‌ను ప్ర‌జ‌లు గుండెల్లో పెట్టుకున్నారు. ఇక రెండోసారి కూడా అధికారాన్ని చేజిక్కించుకోవాల‌నే ఆలోచ‌న‌తో కేసీఆర్ ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్లారు. 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో భాగంగా రాష్ట్రంలో ఎన్నిక‌లు జ‌రిగితే దెబ్బ ప‌డే ప్ర‌మాదం ఉంద‌ని భావించిన ఆయ‌న ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్లార‌నే అభిప్రాయాలున్నాయి. 2018లోనే రాష్ట్ర అసెంబ్లీకి జ‌రిగిన ఆ ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ మ‌రోసారి భారీ విజ‌యం సాధించి అధికారంలోకి వ‌చ్చింది. కానీ ఆ త‌ర్వాతి ఏడాది లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో మాత్రం పార్టీకి ఆశించిన ఫ‌లితాలు రాలేవు. ఇక ఇప్పుడు ప్ర‌జ‌ల్లో కేసీఆర్‌పై వ్య‌తిరేక‌త పెరుగుతుంద‌నే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయ‌ని దుబ్బాక ఉప ఎన్నిక‌లో ఓట‌మి జీహెచ్ఎంసీ ఫ‌లితాలు అందుకు నిద‌ర్శ‌న‌మ‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు.

ఈ నేప‌థ్యంలో ముచ్చ‌ట‌గా మూడోసారి రాష్ట్రంలో అధికారంలోకి రావాల‌నే ప‌ట్టుద‌ల‌తో ఉన్న కేసీఆర్ మ‌రోసారి ముంద‌స్తు వ్యూహాన్ని ఎంచుకున్నారా? అంటే రాజ‌కీయ వ‌ర్గాల నుంచి అవుననే స‌మాధానాలు వినిపిస్తున్నాయి. ఇటీవ‌ల ఆయ‌న రాష్ట్ర రాజ‌కీయాల‌పై సంక్షేమ ప‌థ‌కాల‌పై ప్ర‌త్యేక దృష్టి పెట్ట‌డ‌మే అందుకు కార‌ణం. సంచ‌ల‌న ప‌థ‌కాల‌ను ప్ర‌వేశ‌పెట్టి ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త త‌గ్గించి ముంద‌స్తుకు వెళ్లాల‌నే ప్ర‌ణాళిక‌తోనే కేసీఆర్ నిర్ణ‌యాలు తీసుకుంటున్న‌ట్లు తెలుస్తోంది. కేసీఆర్ ఏం చేసినా దాని వెన‌క ఏదో ఓ వ్యూహం దాగి ఉంటుంద‌నేది తెలిసిన విష‌య‌మే. తాజాగా అసెంబ్లీలో ఉద్యోగ నోటిఫికేష‌న్లు విడుద‌ల చేస్తామ‌ని ద‌ళిత బంధు ప‌థ‌కాన్ని అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ అమ‌లు చేస్తామ‌ని కేసీఆర్ చేసిన ప్ర‌క‌ట‌న‌ల వెన‌క ముంద‌స్తు వ్యూహ‌మే ఉంద‌ని రాజ‌కీయ నిపుణులు అనుకుంటున్నారు.

వ‌రుస‌గా రెండు ఎన్నిక‌ల్లోనూ కేసీఆర్‌కు ప్ర‌త్య‌ర్థి పార్టీల నుంచి పెద్ద‌గా పోటీ ఎదురు కాలేదు. కానీ ఈ సారి బండి సంజ‌య్ దూకుడుతో బీజేపీ.. రేవంత్ రెడ్డి జోరుతో కాంగ్రెస్ కేసీఆర్‌ను ఓడించేందుకు స‌ర్వ‌శ‌క్తులూ ఒడ్డుతున్నాయి. అధికార ప్ర‌భుత్వంపై ఉన్న ప్ర‌జా వ్య‌తిరేక‌త‌ను సొమ్ము చేసుకునేందుకు ఇప్ప‌టికే ఈ పార్టీలో పాద‌యాత్ర స‌భ‌లు స‌మావేశాలు ర్యాలీలు అంటూ జ‌నాల్లోకి వెళ్లాయి. ఈ ప‌రిణామాల‌న్నింటినీ జాగ్ర‌త్త‌గా ప‌రిశీలిస్తున్న కేసీఆర్‌.. ప్ర‌త్య‌ర్థుల‌కు గ‌ట్టి దెబ్బ కొట్టేందుకు వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. వ‌చ్చే ఏడాది ద్వితీయార్థంలో కేసీఆర్ ముందస్తు ఎన్నిక‌ల‌కు వెళ్తార‌నే అభిప్రాయాలు బ‌లంగా వినిపిస్తున్న స‌మ‌యంలో ఆయ‌న తీసుకుంటున్న సంచ‌ల‌న నిర్ణ‌యాలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. వివిధ ప‌థ‌కాల‌ను ప్ర‌క‌టించ‌డంతో పాటు ఆ ప‌థ‌కాల అమ‌లుకు కేసీఆర్ చెబుతున్న గ‌డువు ముంద‌స్తు ఎన్నిక‌ల ఊహాగానాల‌కు మ‌రింత బ‌లాన్ని చేకూరుస్తోంది.

మూడు నెల‌ల త‌ర్వాత 80 వేల ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్లు విడుద‌ల చేస్తామ‌ని వ‌చ్చే బ‌డ్జెట్‌లో ద‌ళిత బంధు కోసం రూ.20 వేల కోట్లు కేటాయిస్తామ‌ని కేసీఆర్ తాజాగా ప్ర‌క‌టించారు. వ‌చ్చే ఏడాదిలో ముంద‌స్తుకు వెళ్లాల‌ని అనుకుంటున్న కేసీఆర్‌.. స‌రిగ్గా ఆ స‌మ‌యానికి క‌లిసొచ్చేలా ఈ ప్ర‌క‌ట‌న‌లు చేశార‌ని రాజకీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు. ఎన్నిక‌ల‌కు ముందు ఉద్యోగాల నోటిఫికేష‌న్ వేస్తే నిరుద్యుగుల్లో ఉన్న వ్య‌తిరేక‌త త‌గ్గుతుంద‌ని ఆయ‌న భావిస్తున్న‌ట్లు తెలిసింది. ఇక ఎన్నిక‌ల ప్ర‌చారంలో ద‌ళిత బంధు ప‌థ‌కాన్ని తాయిలంగా చూపించి ఓట్లు రాబ‌ట్టుకునే అవ‌కాశం ఉంది. ఇన్నేళ్ల‌లో ఒక్క‌సారి కూడా పోడు భూముల‌పై స్పందించిన ఆయ‌న‌.. ఇప్పుడు సానుకూల ప్ర‌క‌ట‌న‌లు చేయ‌డం వెనక కూడా ఇదే ముంద‌స్తు వ్యూహం దాగి ఉంద‌నే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.