వైసీపీ కొత్త ఎమ్మెల్సీలు వీళ్లే…!

ఏపీలో అధికార వైసీపీలో ఇప్పుడు రెండు విష‌యాలు అంత‌ర్గ‌తంగా ఒక్క‌టే టెన్ష‌న్ రేపుతున్నాయి. ద‌స‌రా త‌ర్వాత జ‌గ‌న్ త‌న కేబినెట్‌ను ప్ర‌క్షాళ‌న చేయ‌నున్నారు. ఇప్పుడు మంత్రులుగా ఉన్న వారిలో అంద‌రిని త‌ప్పించేస్తారా ? లేదా ముగ్గురు, న‌లుగురు మిన‌హా అంద‌రిని ప‌క్క‌న పెడ‌తారా ? అన్న‌ది కాస్త స‌స్పెన్స్‌. వైసీపీ ఎమ్మెల్యేలు, సీనియ‌ర్లు కేబినెట్‌లో మార్పులు, చేర్పులు టెన్ష‌న్‌తో ఉంటే.. పార్టీ కోసం ఎప్ప‌టి నుంచో త్యాగాలు చేసిన వారు, సీనియ‌ర్ నేత‌లు ఇప్పుడు ఎమ్మెల్సీ ఛాన్స్ వ‌స్తుందా ? రాదా ? అన్న టెన్ష‌న్‌తో ఉన్నారు.

ఏపీ శాస‌న‌మండ‌లిలో భారీ ఖాళీలు ఉన్నాయి. వీటిని భ‌ర్తీ చేసేందుకు త్వ‌ర‌లోనే కేంద్ర ఎన్నిక‌ల సంఘం నోటిఫికేష‌న్ రిలీజ్ చేయ‌నుంది. ఇటీవ‌లే స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల ఫ‌లితాలు రావ‌డంతో ఆ కోటాలో కొన్ని ఎమ్మెల్సీలు భ‌ర్తీ చేయాల్సి ఉంది. ఇక ఎమ్మెల్యేల కోటాలో కూడా కొన్ని ఎమ్మెల్సీలు భ‌ర్తీ చేస్తారు. క‌రోనా కార‌ణంగా ఈ ఎన్నిక‌లు వాయిదా ప‌డ్డాయి. ప్ర‌స్తుతం మండ‌లిలో వైసీపీకి 12, టీడీపీకి 15, బీజేపీకి ఒక స్థానం ఉన్నాయి. ఇక న‌లుగురేసి ఇండిపెండెంట్‌, పీడీఎఫ్ స‌భ్యులు ఉన్నారు. ఏపీ మండ‌లిలో మొత్తం 58 స్థానాలు ఉన్నాయి.

ఇప్పుడు 14 స్థానాల‌ను భ‌ర్తీ చేయాల్సి ఉంది. ఈ సీట్ల‌న్ని అధికార వైసీపీ ఖాతాలోనే ప‌డ‌నున్నాయి. ప్ర‌తిప‌క్షాల‌కు ఒక్క‌టంటే ఒక్క సీటు కూడా రాదు. ఇక వైసీపీ నుంచి కొత్త ఎమ్మెల్సీలు ఎవ‌రు అవుతారు ? అన్న‌దే ఇప్ప‌డు అధికార పార్టీలో ఉత్కంఠగా మారింది. వైసీపీ వ‌ర్గాల్లో విన‌ప‌డుతోన్న స‌మాచారం ప్ర‌కారం గుంటూరు జిల్లాకు చెందిన చిల‌క‌లూరిపేట మాజీ ఎమ్మెల్యే మ‌ర్రి రాజ‌శేఖ‌ర్‌తో పాటు చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ‌మోహ‌న్‌కు రెండు ఎమ్మెల్సీలు ఖ‌రార‌య్యాయంటున్నారు. వీరిని క‌మ్మ‌, కాపు కోటాలో భ‌ర్తీ చేస్తార‌ని అంటున్నారు.

ఈ సారి ఎమ్మెల్సీ సీట్ల భ‌ర్తీ వ‌చ్చే కేబినెట్ ప్ర‌క్షాళ‌న‌ను బేస్ చేసుకునే ఉంటుంద‌ని అంటున్నారు. జ‌గ‌న్ మ‌ర్రి రాజ‌శేఖ‌ర్ లాంటి వాళ్ల‌ను మంత్రిని చేస్తానని గ‌తంలోనే హామీ ఇచ్చారు. ఇక వీరిద్ద‌రితో పాటు టీడీపీ నుంచి వైసీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే బీద మ‌స్తాన్‌రావు, చిత్తూరు జిల్లా కుప్పం వైసీపీ ఇన్‌చార్జ్ భ‌ర‌త్‌కు కూడా ఎమ్మెల్సీ ఖాయం అంటున్నారు. కుప్పంలో చంద్ర‌బాబును బాగా టార్గెట్ చేస్తోంది వైసీపీ. ఈ క్ర‌మంలోనే అక్క‌డ భ‌ర‌త్‌కు ఎమ్మెల్సీ ఇస్తే.. మ‌రింత ప‌ట్టు సాధించ‌వ‌చ్చ‌న్న‌దే వైసీపీ ప్లాన్‌గా తెలుస్తోంది.

ఇక అదే చిత్తూరు జిల్లా నుంచి మ‌రో రెడ్డి నేత‌కు కూడా ఎమ్మెల్సీ ఖాయం అంటున్నారు. ఇక ఉమ్మారెడ్డి వెంక‌టేశ్వ‌ర్లు ఈ సారి రాజ్య‌స‌భ‌కు వెళ్లాల‌ని కోరుతున్నారు. అయితే ఆయ‌న‌కు మ‌రోసారి ఎమ్మెల్సీయే ఇస్తార‌ని అంటున్నారు. ఈ సారి ఎమ్మెల్సీ ప‌ద‌వుల భ‌ర్తీలో అనూహ్య నిర్ణ‌యాలు కూడా ఉంటాయ‌ని తెలుస్తోంది.