వర్చువల్ మహానాడు….నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్

కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో లాక్ డౌన్ విధించడంతో సమావేశాలు, సభలకు అనుమతి లభించడం లేదు. స్కూళ్లు…ఆన్ లైన్లో క్లాసులు నిర్వహిస్తున్నాయి. అదే తరహాలో ఇపుడు రాజకీయ సమావేశాలను నిర్వహిస్తున్నారు. ప్రతి ఏటా టీడీపీ అట్టహాసంగా నిర్వహించే మహానాడు కార్యక్రమం తొలిసారిగా ఆన్ లైన్లో నిర్వహిస్తున్నారు.

నేటి నుంచి 2 రోజుల పాటు జరగనున్న మహానాడులో దాదాపు 14 వేల మంది కార్యకర్తలు జూమ్ యాప్ ద్వారా భాగస్వాములు కానున్నారు. కరోనాతో పాటు రైతు రుణమాఫీ, వ్యవసాయ సంక్షోభం తదితర అంశాలపై మహానాడులో చర్చించనున్నారు. మహానాడు తరహా రాజకీయ సభ ఆన్ లైన్ లో నిర్వహించడం చరిత్రలో తొలిసారి కావడం విశేషం.

ప్రతి ఏటా మే 28న ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకొని 3 రోజుల పాటు మహానాడు నిర్వహించడం ఆనవాయితీ. గత ఏడాది ఎన్నికల ఫలితాల నేపథ్యంలో మహానాడు రద్దయింది. ఈ సారి కరోనా వల్ల రెండు రోజులకు పరిమితమైంది. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ….దివంగత నేత ఎన్టీ రామారావుకు నివాళులు అర్పించి, ఆపై ప్రతినిధులను ఉద్దేశించి మాట్లాడారు.

ఏపీ, తెలంగాణలతోపాటు విదేశాల్లో ఉన్న వేలాది మంది టీడీపీ కార్యకర్తలు ఈ ఆన్ లైన్ మహానాడులో పాల్గొన్నారు. దాదాపు 10 వేల మంది ఫేస్ బుక్, యూట్యూబ్ ద్వారా ఈ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించనున్నారు. చంద్రబాబు, కళా వెంకట్రావు, కొందరు పాలిట్ బ్యూరో సభ్యులు, కీలక నేతలు మంగళగిరిలోని కార్యాలయం నుంచి లైవ్ లో ప్రసంగించారు.

ఏపీలో ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు పార్టీని బలోపేతం చేయాలని కార్యకర్తలకు చంద్రబాబు పిలుపునిచ్చారు. గత సంవత్సర కాలంలో టీడీపీ కార్యకర్తలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని, వారి త్యాగాలు వృథా కావని బాబు ఆవేదన వ్యక్తం చేశారు. 22 ఏళ్లు అధికారంలో, 16 ఏళ్లు ప్రతిపక్షంలో ఉన్నామని…అయినా ఎప్పుడు ప్రజల పక్షంలో నిలిచామని చెప్పారు.

ఎటువంటి సమస్యలకైనా అందుబాటులో ఉన్న టెక్నాలజీ పరిష్కార మార్గాన్ని చూపిస్తుందన్న తన నమ్మకం మరోసారి బలపడిందని చంద్రబాబు అన్నారు. లాక్ డౌన్ సమయంలో భౌతిక దూరం పాటిస్తూ, డిజిటల్ సోషలైజేషన్ దిశగా సాగుతున్నామని, ఈ సంవత్సరం జరుగుతున్న డిజిటల్ మహానాడు కూడా అటువంటిదేనని తెలిపారు.

ఇండియాలోనే తొలిసారిగా ఓ రాజకీయ సమావేశం డిజిటల్ మాధ్యమంగా సాగుతోందని చంద్రబాబు అన్నారు. టీడీపీకి చెందిన వారంతా తమ స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్ లలో జూమ్ యాప్ ను ఇన్ స్టాల్ చేసుకుని ఈ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు..