బీజేపీలో టెన్షన్ పెంచేస్తున్న ‘క్విట్ మోడి’ ఉద్యమం

వచ్చే ఏడాదిలో జరగబోతున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో గెలవడం బీజేపీకి అంత వీజీ కాదన్న విషయం అర్ధమైపోతోంది. వివిధ కారణాల వల్ల నరేంద్ర మోడీ పై జనాల్లో వ్యతిరేకత పెరిగిపోతుండటం ముఖ్యమైన కారణం. అయితే ఇతర కారణాలు ఎన్నున్నా రైతుల్లో పెరుగుతున్న వ్యతిరేకత మాత్రం చాలా కీలకమని చెప్పాలి. మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా అఖిల భారత కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో జరుగుతున్న తొమ్మిది నెలల ఆందోళన తీవ్రంగా మారబోతోంది.

ఈ మధ్యనే జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్లో మమతాబెనర్జీని ఓడగొట్టాలని నరేంద్రమోడి, అమిత్ షా ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదు. మూడోసారి గెలిచిన మమత హ్యాట్రిక్ సీఎం అనిపించుకున్నది. మమత గెలుపులో బెంగాల్ లోని రైతులది కూడా కీలక పాత్రన్న విషయం మర్చిపోకూడదు. మోడికి వ్యతిరేకంగా కిసాన్ సంఘం నేతలు గ్రామ గ్రామాన తిరిగి బీజేపీకి ఓట్లేయద్దని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు.

ఇదే పద్ధతిలో వచ్చే ఏడాది ఎన్నికలు జరగబోతున్న ఐదు రాష్ట్రాల్లో ఉత్తర ప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్ మీద కిసాన్ సంఘ్ నేతలు దృష్టి పెట్టారు. పై రాష్ట్రాల్లో బీజేపీ వ్యతిరేకంగా ఓట్లు వేయించటమే టార్గెట్ గా కిసాన్ సంఘ్ నేతలు క్విట్ మోడి’ ఉద్యమం మొదలుపెట్టారు. యూపీ, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో బీజేపీని ఓడించాలంటు రైతు సంఘాల నేతలు కార్యాచరణ రెడీ చేస్తున్నారు.

గడచిన తొమ్మిది నెలలుగా ఢిల్లీ శివార్లలో ఆందోళన చేస్తున్న రైతుల్లో ఎక్కువమంది యూపీ, పంజాబ్, హర్యానా వాళ్ళే కావటం గమనార్హం. కాబట్టి పై రాష్ట్రాలకు చెందిన రైతు సంఘాల నేతలు తొందరలోనే పంజాబ్, యూపీ, ఉత్తరాఖండ్ లో క్యాంపు వేయాలని డిసైడ్ చేశారట. క్విట్ మోడి ఉద్యమాన్ని రాష్ట్ర రాజధానుల నుండి గ్రామ స్థాయిలోకి తీసుకెళ్ళాలన్న టార్గెట్ గా రైతు నేతలు పనిచేస్తున్నారు. రైతు నేతల తాజా నిర్ణయంతో బీజేపీ అగ్రనేతల్లో టెన్షన్ మొదలైంది.

అసలే జనాల్లో వ్యతిరేకత మూటగట్టుకున్న కేంద్రంపై క్విట్ మోడి ఉద్యమం మూలిగే నక్కపై తాటికాయ పడినట్లుగా తయారవుతోందని కమలనాదులు గోల మొదలుపెట్టారట. మొన్నటి పంజాబ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ సీనియర్ నేతలు అసలు ప్రచారానికి కూడా వెళ్ళలేకపోయారు. యూపిలో కూడా కొన్నిచోట్ల కమలనాథులను ప్రచారానికి జనాలు రానీయలేదు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే యూపీ, ఉత్తరాఖండ్ లో తిరిగి అధికారం అందుకోవడం కష్టమే అని అనుకుంటున్నారట. మరి మోడి వ్యతిరేకోద్యమం ఎప్పుడు, ఏ స్ధాయిలో మొదలవుతుందో చూడాల్సిందే.