మళ్లీ భయానకం… హైదరాబాదు దాటిన కరోనా!

తెలంగాణ మొత్తం విజృంభించిన కరోనాను ప్రభుత్వం సమర్థంగా కంట్రోల్ చేసి రూరల్ తెలంగాణ నుంచి నిర్మూలించగలిగింది అని అందరూ అనుకున్నారు. అది జరిగి ఉండొచ్చు కూడా. అయితే, తెలంగాణ మొత్తం ప్రయాణాలకు అనుమతి ఇచ్చినపుడు హైదరాబాదులో ఉన్న కరోనా జిల్లాలకు వ్యాపించకుండా ఉండే అవకాశమే లేదు. అదే నిజమైంది. రెండో దశలో ఈరోజు కరోనా జిల్లాలకు వ్యాపించింది. మెల్లగా తగ్గుతూ వచ్చి ఇంతకాలం హైదరాబాదులో మాత్రమే నమోదైన కేసులు ఈ రోజు తెలంగాణలోని ఆరు జిల్లాల్లో విజృంభించాయి.

మొత్తం 71 కేసులు నమోదు కాగా… హైదరాబాదు (38) కాకుండా రంగారెడ్డి (7), మేడ్చల్ (6), సూర్యపేట (1), వికారాబాద్ (1), నల్గొండ (1), నారాయణ పేట (1) జిల్లాల్లో కేసులు నమోదయ్యాయి. కూలీల్లో 12, ఎన్నారైలలో 4 కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. తాజా కేసులతో కలిపి మొత్తం కేసుల సంఖ్య 1991కి చేరింది. ఈరోజు అత్యధికంగా 120 మంది డిశ్చార్జి అవగా.. 650 యాక్టివ్ కేసులున్నాయి.

మరోవైపు రాబోయే రోజుల్లో మళ్లీ లాక్ డౌన్ పూర్తి స్థాయిలో పెడతారని సామాజిక మాధ్యమాల్లో వదంతులు వస్తున్నా… అదేం ఉండదు అని కొట్టి పారేస్తున్నారు. ఎందుకంటే… కరోనా ముప్పు కంటే లాక్ డౌన్ కష్టాలు తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి. అందుకే సహజీవనం చేసకుంటూ కరోనా కలిసి బతకాల్సిందే అని కేంద్రం ఒక తీర్మానానికి వచ్చాక సడలింపులు భారీగా ఇవ్వడం మొదలుపెట్టింది. కేసులు దేశంలో ఎక్కువ సంఖ్యలో పెరుగుతున్నా మరణాలు అదుపులో ఉండటం వల్ల దేశంలో తీవ్రత లేదని ప్రభుత్వం భావిస్తోంది.