కేసీయార్ కు షాక్ తప్పదా ?

ఎంతో ప్రిస్టేజిగా అనుకుంటున్న దళితబంధు పథకమే చివరకు కేసీయార్ కు ఫాకిస్తుందా ? ఏమో పరిస్ధితులు చూస్తుంటే ఇదే అనుమానంగా ఉంది. లక్ష కోట్ల రూపాయలతో దళితబంధు పథకాన్ని అమలు చేయబోతున్నట్లు కేసీయార్ ఆర్భాటంగా ప్రకటించిన విషయం తెలిసేందే. పైలెట్ ప్రాజెక్టుగా ముందు హుజూరాబాద్ నియోజకవర్గంలో అమలు చేయబోతున్నట్లు స్వయంగా కేసీయారే ప్రకటించారు. దాంతో ఈ పథకం అచ్చంగా ఎన్నికల పథకమనే ఆరోపణలు పెరిగిపోతున్నాయి.

సరే కేసీయార్ ప్రకటన, ప్రతిపక్షాల ఆరోపణలు ఎలాగున్నా తాజాగా షెడ్యూల్ కులాల సమగ్రాభివృద్ధి కమిటి రంగంలోకి దిగింది. నియోజకవర్గంలో 45 వేలమంది దళితులుంటే కేసీయార్ ఏమో పైలెట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్ లో వంద దళితకుటుంబాలకు పథకాన్ని వర్తింపేయాలని అనుకున్నారు. దీనికే షెడ్యూల్ కులాల కమిటి అడ్డం తిరిగింది. 100 దళిత కుటుంబాలకు కాదని నియోజకవర్గంలోని మొత్తం దళితులందరికీ ఆగష్టు 15లోగా ఒకేసారి పథకాన్ని వర్తింపచేయాలంటు అల్టిమేటమ్ జారీచేసింది.

అలాగే, అదేనెల 16-31 తేదీల మధ్య రాష్ట్రంలోని దళితులందరికీ దళితబంధు పథకాన్ని వర్తింపచేయాల్సిందే అని పట్టుబట్టింది. రైతుబంధు పథకం లాగే ఎలాంటి షరతులు లేకుండా దళితబంధు పథకాన్ని అమలు చేయకపోతే టీఆర్ఎస్ అభ్యర్ధిని ఓడిస్తామంటు గట్టి వార్నింగే ఇచ్చింది కమిటి. బుధవారం హైదరాబాద్ లో జరిగిన ఓ ఫంక్షన్ హాలులో జరిగిన సమావేశానికి ఎస్సీలోని 59 ఉపకులాల మేధావులు, ఉద్యమకారులు, రచయితలు, హక్కుల కార్యకర్తలు హాజరయ్యారు.

హుజూరాబాద్ ఉపఎన్నికలో దళితుల ఓట్ల కోసమే కేసీయార్ డ్రామాలు ఆడుతున్నట్లు ఎంఆర్పీఎస్ వ్యవస్ధాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ ఫుల్లు ఫైర్ అయ్యారు. గడచిన ఏడేళ్ళలో దళితులను కేసీయార్ అనేక సందర్భాల్లో చేసిన మోసాలను గుర్తుచేశారు. మొత్తానికి ఉపఎన్నిక సందర్భంగా కేసీయార్ తీసుకొచ్చిన దళితబంధు పథకం అమలు అంశం హాట్ టాపిక్ అయిపోయింది. లక్ష కోట్ల రూపాయలతో ఈ పథకాన్ని అమలు చేయబోతున్నట్లు కేసీయార్ చెప్పటమే విచిత్రంగా ఉంది. ఓ పథకానికి లక్ష కోట్లు కేటాయించటం జరిగేపనికాదు. దాంతోనే పథకం అమలుపై అందరిలోను అనుమానాలు పెరిగిపోతున్నాయి.