జగన్ తెగింపు ఆమెకు కొత్త టెన్షన్ గా మారిందా?

ఏదైనా విషయం అనుకుంటే.. దాన్ని పూర్తి చేసే వరకూ పట్టువదలని విక్రమార్కుడి మాదిరి ఎంతకైనా రెఢీ అనే తీరు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిలో కాస్త ఎక్కువే. ఆయన్ను సన్నిహితంగా చూసే వారందరికి ఈ విషయం మీద అవగాహన ఎక్కువే. తాను అనుకున్నది ఎట్టి పరిస్థితుల్లో జరిగి తీరాలనే పట్టుదల..ఇప్పుడు ఏపీ సీఎస్ నీలం సాహ్నికి కొత్త టెన్షన్ గా మారిందన్న మాట వినిపిస్తోంది.

కెరీర్ లో ఇప్పటివరకూ ఎలాంటి మచ్చ లేని క్లీన్ ఇమేజ్ ఉన్న నీలం.. ప్రభుత్వ ప్రధానకార్యదర్శిగా మారిన కాలం నుంచి రాజీ పడాల్సి వస్తోందంటున్నారు. గతంలో మాదిరి నిర్మోహమాటంగా వ్యవహరించటం లేదంటున్నారు. ఇప్పుడామెకు కొత్త కష్టం వచ్చినట్లుగా జోరైన ప్రచారం సాగుతోంది. ప్రభుత్వ కార్యాలయాలకు అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండా రంగుల్ని వేస్తున్నట్లుగా ఫిర్యాదు రావట.. హైకోర్టు రియాక్టు కావటం తెలిసిందే.

అయినప్పటికీ తాము చేసిన పనిని సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్న ఏపీ సర్కారుకు ఇటీవల హైకోర్టు మొట్టికాయ వేయటమే కాదు.. రంగులు మార్చని పక్షంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శితో పాటు.. అధికారులపై చర్యలు తప్పవన్న ఘాటుగా రియాక్టు అయ్యింది ఏపీ హైకోర్టు. అంతేకాదు.. ఈ నెల 28న కోర్టుకు స్వయంగా వచ్చి.. ఈ వ్యవహారంపై అప్డేట్ ఇవ్వాలని చెప్పారు.

దీంతో..ఏపీ సీఎస్ నీలం సాహ్ని స్పందించారు. ఆదివారం సెలవును క్యాన్సిల్ చేసి.. ఉన్నతాధికారులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ప్రభుత్వ భవనాలకు రంగులు వేసిన వివాదంతో పాటు.. హైకోర్టు తాజాగా చేసిన వ్యాఖ్యలపైనా పెద్ద ఎత్తున చర్చ జరిగింది.

కోర్టు ఆదేశాల్ని అమలు చేయని పక్షంలో కోర్టు ధిక్కారణ కింద ఇబ్బందులు తప్పవన్న విషయం మీద క్లారిటీకి వచ్చారు. ఈ నేపథ్యంలో అటు ప్రభుత్వానికి.. ఇటు కోర్టుకు మధ్య నలిగిపోకుండా నిర్ణయాలు ఉంటే మంచిదన్న అభిప్రాయానికి వచ్చినట్లు చెబుతున్నారు. మరేం జరుగుతుందో కాలమే సమాధానం ఇవ్వాలి.