కేసీయార్ వితండ వాదన

కృష్ణా జలాల వినియోగంపై కేసీయార్ వితండ వాదన మొదలుపెట్టారు. సమైక్యరాష్ట్రాన్ని విడదీసినపుడు నీటి వినియోగం విషయంలో విభజన చట్టం స్పష్టమైన ఆదేశాలిచ్చింది. ప్రధానంగా కృష్ణా జలాలను తెలంగాణా 34 శాతం, ఏపి 66 శాతం వాడుకునేట్లు ఒప్పందం కుదిరింది.

అప్పట్లో రాష్ట్ర విభజన కోసమని అన్నింటినీ అంగీకరించిన కేసీయార్ ఇపుడు విభజన చట్టాన్ని అంగీకరించేది లేదని చెప్పటమే విచిత్రంగా ఉంది. కృష్ణాజలాల వినియోగాన్ని 50:50 శాతం అంటే 405.5 నిష్పత్తి ప్రకారమే వాడుకోవలంటు కొత్త మెలికపెట్టారు. దీంతో నీటిమంటలు మరింతగా పెరిగిపోయే ప్రమాధం కనబడుతోంది. ఒక్క నీటి పంపకాలను మాత్రమే విభజన చట్టంలో పేర్కొన్న చాలా అంశాలను కేసీయార్ ఏ రోజు గౌరవించలేదు.

హైదరాబాద్ లో ఉన్న కేంద్రప్రభుత్వ సంస్ధలను రెండు రాష్ట్రాలకు పంపిణీ చేయటం కోసం కేంద్రం షిలాబిడే అనే అధికారి నేతృత్వంలో కమిటి వేసింది. ఆమె పెద్ద కసరత్తు చేసి నివేదిక సమర్పించింది. అయితే ఆ నివేదికను తాము అంగీకరించేది లేదని చెప్పారు. తమ భూభాగంపై ఉన్న సంస్ధలన్నీ తమదే అంటు తెగేసిచెప్పారు.

అలాగే హైదరాబాద్ లో ఉన్న వ్యవసాయ విశ్వవిద్యాలయం, తెలుగు విశ్వవిద్యాలయం లాంటి మరికొన్ని యూనివర్సిటీలను కూడా ఏకపక్షంగా సొంతం చేసేసుకున్నారు. ఈ రకంగా విభజన చట్టం అమలును కేసీయార్ తుంగలో తొక్కిన విషయం అడుగడుగునా బయటపడింది. అయితే ఏ దశలో కూడా కేంద్రప్రభుత్వం అడ్డుచెప్పలేదు. విభజన చట్టాన్ని అమలు చేయాల్సిన కేంద్రమే చోద్యం చూస్తున్నది కాబట్టే ఇఫుడు నదీ జలాల పంపిణీ విషయంలో కూడా అడ్డం తిరిగారు.