ఇప్పుడు కూడా గొప్పలు చెప్పుకోవటమేనా బాబు?

ఎప్పుడు ఏం మాట్లాడితే బాగుంటుందన్న విషయానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అతికినట్లుగా సరిపోతే.. అందుకు భిన్నంగా ఒకప్పుడు ఆయనకు గురువుగా వ్యవహరించిన ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కనిపిస్తారు. ఎప్పుడేం మాట్లాడాలన్న దానికి సంబంధించి టైమింగ్ ను చంద్రబాబు బాగా మిస్ అవుతున్నారన్న విమర్శలకు తగ్గట్లే ఆయన తాజా మాటలు ఉండటం గమనార్హం.

ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పోతిరెడ్డిపాడు అంశం హాట్ టాపిక్ గా మారింది. ఈ ప్రాజెక్టుకు ఎత్తిపోతల పథకం ద్వారా శ్రీశైలం ప్రాజెక్టు నుంచి మరింత నీళ్లు ఎత్తుకెళ్లే ప్రయత్నానికి ఏపీ సీఎం జగన్ తెర తీశారని తెలంగాణవాదులు ఆరోపిస్తుంటే.. అదేం లేదు.. మా వాటాను మేం మరింత సమర్థవంతంగా తీసుకోవటానికే తాజా చర్యలు అని జగన్ సర్కారు స్పష్టం చేస్తుంది. అధికారికంగా తమకు కేటాయించిన దాని కంటే అదనంగా నీళ్లు తీసుకునే ఉద్దేశం తమకు లేదని జగన్ సర్కారు స్పష్టం చేస్తుంది.

ఇలాంటివేళ.. తెలంగాణ ప్రయోజనాల్ని దెబ్బ తీసేలా పోతిరెడ్డిపాటును నిర్మించారన్న వాదన అంతకంతకూ పెరుగుతోంది. ఆచితూచి అన్నట్లుగా మాట్లాడుతున్న ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి భిన్నంగా చంద్రబాబు తన గొప్పల పురాణాన్ని విప్పటం షాకింగ్ గా మారింది. వివాదంగా మారిన పోతిరెడ్డిపాడును పూర్తి చేసిన ఘనత తనదేనన్న మాట బాబు నోటి వెంట రావటం చూస్తే.. ఆంధ్రోళ్ల సంగతేమో కానీ.. తెలంగాణ ప్రజలకు మరింత కాలిపోవటం ఖాయం.

ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆచితూచి అన్నట్లు వ్యవహరించటం మినహా మరో మార్గం లేనప్పుడు.. వీలైనంత మౌనాన్ని పాటించటం చాలా ముఖ్యం. అందుకు భిన్నంగా పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు నిర్మాణంలో తానెన్ని సమస్యల్ని ఎదుర్కొన్నానన్న విషయాన్ని చెప్పే ప్రయత్నం చేశారు. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టును ఎన్టీఆర్ ప్రారంభిస్తే.. తాను పూర్తి చేశానని చెప్పారు.

సీమకు నీళ్లు ఇచ్చే ప్రాజెక్టుల్ని ప్రారంభించిన ఘనత ఎన్టీఆర్ దేనని చెప్పారు. మొత్తంగా పోతిరెడ్డిపాడు ఘనత తనదేనని చెప్పుకునేందుకు తాపత్రయపడుతున్న బాబు.. తెలంగాణ ప్రజల ఆగ్రహానికి గురి కావటం తప్పదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అవసరం లేని వేళలో.. కెలుక్కొని మరీ మాట్లాడాల్సిన అవసరం ఉందా బాబు?