#Thankyoulokeshanna ట్రెండింగ్


ఇంతకుముందు సోషల్ మీడియాలో నారా లోకేష్ పేరు ట్రెండ్ అవుతోందంటే అది ట్రోలింగ్‌లో భాగంగానే అని ఫిక్సయిపోయేవాళ్లు. కానీ ఈ రోజు లోకేష్ గురించి ఒక పాజిటివ్ హ్యాష్ ట్యాగ్ నేషనల్ లెవెల్లో ట్రెండ్ అవుతుండటం విశేషం. #Thankyoulokeshanna.. ఈ హ్యాష్ ట్యాగ్ మీద వేలల్లో ట్వీట్లు పడుతున్నాయి. తెలుగుదేశం మద్దతుదారుల బ్యాకప్‌తోనే ఈ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతుండొచ్చు కానీ.. ఇందులో సామాన్యులు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు.

లోకేష్ మీద పాజిటివ్ ట్వీట్లు వేస్తున్నారు. ఇదంతా ఆంధ్రప్రదేశ్‌లో టెన్త్, ఇంటర్ పరీక్షల రద్దు నేపథ్యంలో జరుగుతున్నదే. కరోనా నేపథ్యంలో పరీక్షలు రద్దు చేయాలని లోకేష్ గట్టిగానే వాయిస్ వినిపించాడు. పరీక్షలు రద్దయ్యేదాకా పోరాటం ఆపనని ప్రకటించాడు. కేంద్రానికి ఈ విషయమై లేఖలు కూడా రాశాడు. సుప్రీం కోర్టు గట్టిగా హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఏపీ సర్కారు గురువారం పరీక్షల రద్దు గురించి ప్రకటన చేసిన సంగతి తెలిసిందే.

పరీక్షల రద్దు క్రెడిట్ అంతా లోకేష్‌కు ఇచ్చేయలేం కానీ.. అతను ఈ దిశగా బలంగా వాయిస్ వినిపించిన మాట మాత్రం వాస్తవం. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఈ విషయమై లోకేష్ పట్ల సానుకూల అభిప్రాయం ఉంది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం వాళ్లు మొదలుపెట్టిన #Thankyoulokeshanna హ్యాష్ ట్యాగ్‌కు సామాన్యులు కూడా స్పందిస్తున్నట్లున్నారు. ఎప్పుడూ సోషల్ మీడియాలో నెగెటివ్ హ్యాష్ ట్యాగ్‌లతో వార్తల్లో నిలిచే లోకేష్‌కు ఇది భిన్నమైన అనభవమే.

ఒకప్పుడు ప్రసంగాల్లో, ప్రెస్ మీట్లలో తడబాట్ల కారణంగా అతను బాగా ట్రోలింగ్‌కు గురయ్యాడు. దీనికి తోడు నేరుగా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకుండా ఎమ్మెల్సీగా నామినేట్ అయి మంత్రి పదవి చేపట్టడం కూడా ఒకింత వ్యతిరేకతకు కారణమైంది. రాజకీయ ప్రత్యర్థులు అతణ్ని సోషల్ మీడియా వేదికగా టూమచ్‌గా టార్గెట్ చేసి అన్ పాపులర్ చేశారు. ఐతే ప్రతిపక్షంలోకి వెళ్లాక లోకేష్‌ క్షేత్ర స్థాయిలోకి దిగి బాగా కష్టపడుతుండటం.. కొంతమేర వాక్చాతుర్యాన్ని పెంపొందించుకోవడం.. ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేస్తూ దూకుడుగా వ్యవహరిస్తుండంతో అతడిపై నెగెటివిటీ తగ్గుతోంది.