ఒక స్టేట్ కు సీఎం.. భారత్ లో శరణార్దిగా తలదాచుకుంటున్నారు


కాలానికి మించిన కఠినమైన వాస్తవం మరొకటి ఉండదు. రాజును పేదలా.. అంతకుమించిన దారుణపరిస్థితుల్లోకి తీసుకెళ్లి శక్తి సామర్థ్యాలు ఒక్క కాలానికి మాత్రమే చెల్లు. తాజా ఉదంతం గురించి చదవితే ఈ మాట ఎంత నిజమన్నది ఇట్టే అర్థమైపోతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా వ్యవహరించిన కీలక నేత.. కాలం పుణ్యమా అని బతుకు జీవుడా అని భారత్ కు శరణార్ధిగా వచ్చి.. మారుమూల ప్రాంతంలో తలదాచుకుంటున్న సిత్రమైన పరిస్థితి తాజాగా వెలుగు చూసింది. సంచలనంగా మారిన ఈ ఉదంతంలోకి వెళితే..

భారత్ కు కాస్త పొరుగునే ఉన్న మయన్మార్ లో ఎలాంటి రాజకీయ పరిస్థితులు ఉన్నాయో తెలిసిందే. ఆ దేశంతో భారత్ కు 1633 కి.మీ. సరిహద్దు ఉంది. మయన్మార్ లో ప్రభుత్వాన్ని కూలదోసి.. ప్రస్తుతం ఆ దేశాన్ని సైన్యం తన గుప్పిట్లో ఉంచుకొని పాలిస్తోంది. సైనికుల దారుణాలతో ఆ దేశ ప్రజలు భయం గుప్పిట్లో బతుకుతున్నారు. ఏ నిమిషాన ఏ ఆయుధం పేలుతుందో.. తమ ఊసురు తీస్తుందోన్న ఆందోళనతో గడుపుతున్నారు. ఇప్పటికే సైనికుల దురాగతాల కారణంగా వందల ప్రాణాలు గాల్లో కలిశాయి.

ఈ నేపథ్యంలో ఆ దేశంలోని పరిస్థితుల్ని భరించలేక భారత్ కు పారిపోయి వచ్చి.. శరణార్ధుల మాదిరి బతుకుతున్న వారు చాలామందే ఉన్నారు. ఒక అంచనా ప్రకారం ఇప్పటివరకు తొమ్మిది వేల మంది వరకు భారత్ కు వలస వచ్చేశారు. అలా వచ్చిన వారిలో ఇరవై మంది ప్రజాప్రతినిధులు ఉంటే.. అందులో ఏకంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఉండటం విశేషం.

చిన్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వ్యవహరించిన సలై లియన్ లుయై.. నేషనల్ లీగ్ ఆఫ్ డెమొక్రసీ పార్టీకి చెందిన నేత. అదేనండి.. మయన్మార్ స్వాంత్య్రం కోసం పోరాడిన ఆంన్ సాన్ సూకీ తెలుసు కదా. ఆమెకు చెందిన పార్టీకి చెందిన వారు. మయన్మార్ లో పరిస్థితులు దారుణంగా మారటంతో ప్రాణభయంతో భారత్ కు బతుకుజీవుడా అని వచ్చేశారు. అలా వచ్చిణ శరణార్దుల్లో ఎక్కువ మంది భద్రతా సిబ్బంది ఉన్నారు. శరణార్ధులుగా వచ్చిన వారిని మానవతా కోణంలో మిజోరం ప్రభుత్వం కేంద్రాన్ని కోరితే.. అందుకు సానుకూలంగా స్పందించింది.

దీనికి మరో కారణం కూడా లేకపోలేదు. మిజోరాంలోని మిజోల పూర్వీకులు.. మయన్మార్ లోని చిన్ సమాజానికి చెందిన వారు ఒకరే. అందుకే భావోద్వేగ బంధంతో వారిని అక్కున చేర్చుకుంటున్నారు. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి.. సైనిక దురాగతాలకు బెంబేలెత్తి పోయి భారత్ కు శరణార్ధిగా వచ్చిన వైనం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మిజోరంలోని ఒక మారుమూల పల్లెలో ఆయన ఆశ్రయం పొందినట్లుగాచెబుతున్నారు.