తెలంగాణలో తొలి ప్రయోగం.. పాజిటివ్ లను ఇంట్లో ఉంచేసి చికిత్స

ఎంత అప్రమత్తంగా ఉన్నా సరే.. చిన్నపాటి పొరపాటుకే భారీ మూల్యాన్ని చెల్లించాల్సిన పరిస్థితి. మందు లేని మాయదారి రోగానికి గురైతే.. వెంటనే ఆసుపత్రికే తరలించాల్సిందే. ఇటీవల ఐసీఎంఆర్ ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం పాజిటివ్ లు వచ్చిన వారిని ఆసుపత్రిలోనే కాదు.. ఇంట్లో ఉంచి కూడా చికిత్స చేసేందుకు వీలు కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే.. ఈ విధానాన్ని తెలుగురాష్ట్రాల్లో ఇప్పటివరకూ అమలు చేసింది లేదు.

తాజాగా తెలంగాణ రాష్ట్రం ఈ ప్రయోగానికి తెర తీసింది. మాదన్నపేటలోని ఒక అపార్ట్ మెంట్ వాసులకు పెద్ద ఎత్తున పాజిటివ్ లు రావటం వారిని ఆసుపత్రికి తరలించిన సంగతి తెలిసిందే. అపార్ట్ మెంట్ లో చేసుకున్న పుట్టినరోజు పార్టీ పుణ్యమా అని మాయదారి రోగం అంటుకోవటం పదుల సంఖ్యలో పాజిటివ్ ల బారిన పడ్డారు. వారందరిని గాంధీకి తరలించారు.

ఇదిలా ఉంటే.. తాజాగా మరికొందరికి పాజిటివ్ లు తేలాయి. వారిని కూడా గాంధీకి తరలించారు. అయితే.. వారిలో మాయదారి రోగానికి తాలుకూ లక్షణాలు తక్కువగా ఉండటంతో వైద్యులు కొత్త నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇటీవల కాలంలో ఐసీఎంఆర్ ఇచ్చిన గైడ్ లైన్స్ కు అనుగుణంగా.. పాజిటివ్ లుగా తేలిన వారిని వారి ఇళ్లల్లోనే ఉంచి చికిత్స చేసేలా నిర్ణయం తీసుకున్నారు.

తాజా ఉదంతంలో పాజిటివ్ లుగా తేలిన వారికి రోగ లక్షణాలు తక్కువగా ఉండటంతో ఇంట్లోనే ఉంచి చికిత్స చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా వారిని ఇంటికి తరలించటంతో పాటు.. వారికి అవసరమైన మందుల్ని ఇచ్చారు. ఈ విధానంలో రోజు పొద్దున.. సాయంత్రం రెండు పూట్ల.. అవసరమైతే మధ్యలో వైద్యుల సలహాలు తీసుకునే వీలుంది. వారు ఉండే ఇంటి ముఖ ద్వారం వద్ద ప్రత్యేకంగా గ్రిల్ ఏర్పాటు చేసి.. వారిని బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటారు.

ఈ విధానం అమలులో ఎలాంటి ఇబ్బందులు ఉంటాయన్న విషయాన్ని తాజా ప్రయోగంతో తేలనుంది. అయితే.. పాజిటివ్ గా తేలిన వారిని ఇళ్లల్లో ఉంచి వైద్యం చేస్తున్నారన్న మాట.. కొందరిలో భయాందోళనలు రేకెత్తిస్తున్నా.. ప్రభుత్వం తీసుకునే నిర్ణయం అన్ని విధాలుగా ఆలోచించిన తర్వాతే తీసుకుంటుంది కాబట్టి అనవసర భయాలు అక్కర్లేదంటున్నారు. మరి.. ఈ ప్రయోగ ఫలితం ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది.