తెలంగాణ కోసం.. సీజేఐ ఎన్వీ ర‌మ‌ణ సంచ‌ల‌న నిర్ణ‌యం

సుప్రీం కోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి ఎన్వీ ర‌మ‌ణ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. అది కూడా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించింది కావ‌డం గ‌మ‌నార్హం. ఈ నిర్ణ‌యంపై తెలంగాణ వ్యాప్తంగా హ‌ర్షాతిరేకాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. తెలంగాణ హైకోర్టులో న్యాయ‌మూర్తుల సంఖ్య 42 ఉండాలి. అయితే.. ప్ర‌స్తుతం 24 మంది మాత్ర‌మే ఉన్నారు. దీంతో కేసులు ఇబ్బడి ముబ్బ‌డిగా పెరిగిపోతున్నాయి.

అంతేకాదు, తీర్పుల విష‌యంలోనూ ఆల‌స్యం జ‌రిగి క‌క్షిదారుల‌కు న్యాయం స‌మ‌యానికి అంద‌డం లేద‌ని.. న్యాయ‌వాదులు, న్యాయ నిపుణులు ఆరోపిస్తున్నారు. ఇక‌, ఇలాంటి స‌మ‌స్య ఒక్క తెలంగాణ కే కాకుండా.. దేశ‌వ్యాప్తంగా అన్ని హైకోర్టుల్లోనూ ఉన్న‌దే. తెలంగాణ విష‌యానికి వ‌స్తే.. దాదాపు రెండేళ్లుగా ఈ స‌మ‌స్య పీడిస్తోంది. రాష్ట్ర ప్ర‌భుత్వం, రాష్ట్ర హైకోర్టు కూడా ఈ విష‌యంపై అనేక సార్లు కేంద్ర న్యాయ‌శాఖ‌కు ఉత్త‌ర ప్ర‌త్యుత్త‌రాలు జ‌రిపాయి.

అయిన‌ప్ప‌టికీ.. ఎలాంటి ప్రోగ్రెస్ క‌నిపించ‌లేదు. కాగా, ప్ర‌స్తుతం సుప్రీంకోర్టు సీజేఐగా ఉన్న ఎన్వీ ర‌మ‌ణ‌.. తెలంగాణ హైకోర్టు స‌మ‌స్య‌పై ప్ర‌త్యేకంగా దృష్టి పెట్టారు. ఆయ‌న చొరవతో తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 24 నుంచి 42కి పెరిగింది. సంబంధిత ఫైలుకు ఆయన ఆమోదం తెలిపారు. రెండేళ్లుగా మూలనపడిన హైకోర్టు ఫైలును సీజేఐ వెలికితీశారు. హైకోర్టు విజ్ఞప్తిని ప్రధాన న్యాయమూర్తి మన్నించారు. న్యాయమూర్తుల సంఖ్యను ఏకంగా 75శాతం పెంచారు. దీంతో తెలంగాణ‌లో న్యాయ వ్య‌వ‌స్థ బ‌లోపేతం అవుతుంద‌ని నిపుణులు పేర్కొంటున్నారు.