ఈటల రాజీనామాకి ముహూర్తం ఖరారు..?

మాజీ మంత్రి ఈటల రాజేందర్.. బీజేపీలో చేరడం ఖాయమైంది. అయితే.. ఆయన ఎప్పుడెప్పుడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి.. టీఆర్ఎస్ ని వీడనున్నారనే విషయంపై తెలంగాణలో పెద్ద చర్చే జరుగుతోంది. కాగా.. తాజాగా.. ఆయన తన రాజీనామాకి ముహూర్తం ఖరారు చేసుకున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే.. ఢిల్లీ వెళ్లి.. బీజేపీ పెద్దలందరితో చర్చలు జరిపిన ఆయన కంషాయ కండువా కప్పుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే.. దానికన్నా ముందు.. కారులో నుంచి దిగాలని అనుకుంటున్నారట. అందుకే.. ముందు దీనిని ముహూర్తం సెట్ చేసుకున్నారని సమాచారం.

ఈ నెల 4న ఈటల రాజేందర్‌ టిఆర్‌ఎస్‌కు, హుజూరాబాద్‌ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారని సమాచారం. ఆ తర్వాత ఆయన మంచిరోజు చూసుకుని ఢిల్లీకి వచ్చి బిజెపిలో చేరతానని ఈటల రాజేందర్‌ అన్నట్లు తెలుస్తోంది.

ఈటల భవిష్యత్‌ కార్యాచరణను ప్రకటించడానికి ఈ నెల 4న విలేకరులతో సమావేశం కానున్నారు. ఆయనతో సహా మొత్తం అయిదుగురు నేతలు బిజెపిలో చేరనున్నట్లు ఆ పార్టీ నేత ఒకరు వెల్లడించారు.సోమవారం జెపి నడ్డాను, మంగళవారం రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి తరుణ్‌ ఛుగ్‌ని, కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డిని ఈటల రాజేందర్‌ కలిశారు.

నిన్న మరోసారి జాతీయ నాయకత్వంతో సమావేశమయ్యారు. ఏనుగు రవీందర్‌ రెడ్డిలు ఛుగ్‌, మాజీ ఎంపి జి.వివేక్‌తో కలిసి ఆ పార్టీ జాతీయ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి బి.ఎల్‌.సంతోష్‌తో సాయంత్రం ఈటల రాజేందర్‌ సమావేశమయ్యారు. అయితే ఆ సమావేశంలోనే ఈటల రాజేందర్‌ తాను బిజెపిలో చేరతానని వెల్లడించినట్లు సమాచారం. ఇక ఆయనతోపాటు ఎవరెవరు పార్టీ మారనున్నారో తెలియాల్సి ఉంది.