బ్లాక్ ఫంగస్ కు చెక్ పెట్టేలా జగన్ నిర్ణయం

కరోనా విసిరిన సవాలుతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న వారికి.. అది సరిపోదన్నట్లుగా బ్లాక్ ఫంగస్ వణికిస్తోంది. కరోనా నుంచి కోలుకున్న తర్వాత బ్లాక్ ఫంగస్ బారిన పడి తీవ్ర అస్వస్థతకు గురి కావటమే కాదు.. ప్రాణాలు పోతున్న వైనాలు పెరుగుతున్నాయి. ఇందుకోసం భారీగా ఖర్చు పెట్టాల్సి వస్తోంది. ఇప్పటికే కరోనా వైద్యం కారణంగా లక్షలాది కుటుంబాలు ఆర్థికంగా దెబ్బ తింటున్నాయి. బ్లాక్ ఫంగస్ లాంటిది ఎదురైతే.. ఆస్తులు అమ్ముకోవటం మినహా మరో మార్గం లేని దుస్థితి. ఇలాంటివేళ.. బ్లాక్ ఫంగస్ విసిరే సవాలుకు ఏపీ సర్కారు భిన్నంగా స్పందించింది.

ఏపీ రాష్ట్ర ప్రజలనకు దున్నుగా నిలిచేలా బ్లాక్ ఫంగస్ చికిత్సను ఆరోగ్య శ్రీ పరిధిలోకి తీసుకురావటమేకాదు.. అందుకు అయ్యే ఖర్చు మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని వైద్య ఆరోగ్య శాఖా ముఖ్యకార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడించారు. రాష్ట్రంలోని ప్రైవేటు ఆసుపత్రుల్లో బ్లాక్ ఫంగస్ కేసులు నమోదైతే.. ఆ విషయాన్ని ప్రభుత్వానికి తెలియజేయాలన్నారు.

ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లోనూ.. ఆరోగ్య శ్రీ నెట్ వర్కు ఉన్న అన్ని ఆసుపత్రుల్లోనూ బ్లాక్ ఫంగస్ కు వైద్యం అందించేలా తీసుకున్న నిర్ణయం బాధితులకు దన్నుగా నిలుస్తుందని చెప్పాలి. లక్షలాది రూపాయిలు ఖర్చు అయ్యే ఈ మాయదారి రోగాన్ని.. ఏపీ ప్రభుత్వం మాదిరే.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా తాను భరిస్తే బాగుంటుందన్న మాట వినిపిస్తుంది. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. మరి.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పటికి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.