జ‌గ‌న్ గుడ్ లుక్స్‌లో మాజీ సీఎం కొడుకు ?


ఏపీలో అధికార వైసీపీలో ప‌ద‌వుల పరంప‌ర కొన‌సాగుతోంది. ఇప్ప‌టికే ప‌లువురు నేత‌ల‌కు ప‌ద‌వులు వ‌చ్చాయి. గ్రామ‌, మండ‌ల‌, ప‌ట్ట‌ణ‌, న‌గ‌ర‌, జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వ‌ర‌కు అన్ని ప‌ద‌వులు వైసీపీ నేత‌ల‌కే వ‌చ్చేస్తున్నాయి. పై నుంచి కింద వ‌ర‌కు వైసీపీ అధికారం మామూలుగా లేదు. ఈ ప‌ద‌వుల సంగ‌తి ఎలా ఉన్నా చ‌ట్ట స‌భ‌ల్లోకి ఎంట్రీ ఇచ్చే విష‌యంలో మాత్రం చాలా మంది ఆశ‌లు పెట్టుకుని ఉన్నారు. జ‌గ‌న్ గ‌త ఎన్నిక‌ల‌కు ముందే ఓపెన్‌గానే ఓ 20 మంది నేత‌ల‌కు ఎమ్మెల్సీ ఇస్తాన‌ని హామీ ఇచ్చారు. ఇందులో సీట్లు త్యాగం చేసిన సీనియ‌ర్లు చాలా మందే ఉన్నారు. ఇంకా చెప్పాలంటే మంత్రి ప‌ద‌వి ఇచ్చి… కేబినెట్లో నా ప‌క్క‌న కూర్చో పెట్టుకుంటాన‌ని చెప్పిన మ‌ర్రి రాజ‌శేఖ‌ర్‌, ఆళ్ల రామ‌కృష్ణా రెడ్డి వంటి నేత‌లు కూడా ఉన్నారు.

ఇక జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి అయ్యాక ప‌లువురికి ఎమ్మెల్సీలు ఇచ్చినా ఆయ‌న హామీ ఇచ్చిన వారిని ప‌క్క‌న పెడుతూ వ‌స్తుండ‌డంతో చాలా మందిలో అస‌హ‌నం పెరుగుతూ వ‌స్తోంది. అయితే వ‌చ్చే జూన్‌లో భారీగా ఎమ్మెల్సీలు ఖాళీలు అవుతున్నాయి. ఎమ్మెల్యేల కోటాలోనే ఏకంగా 10 ఎమ్మెల్సీలు ఖాళీ అవుతున్నాయి. ఈ ప‌ది ప‌దవులు కూడా అధికార పార్టీ ఖాతాలోనే ప‌డ‌నున్నాయి. ఇక స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో ఏపీలోని 13 జిల్లాల్లో ఉన్న ఎమ్మెల్సీలు కూడా వైసీపీ ఖాతాలోకే రానున్నాయి. ఓవ‌రాల్‌గా 25 ఎమ్మెల్సీలు అధికార పార్టీ ఖాతాలో ప‌డ‌డం అంటే మామూలు విష‌యం కాదు.

ఈ క్ర‌మంలోనే జ‌గ‌న్ దృష్టిలో నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ ముఖ్య‌మంత్రి నేదురుమిల్లి జ‌నార్థ‌న్ రెడ్డి త‌న‌యుడు రామ్‌కుమార్ రెడ్డి ప‌డిన‌ట్టు తెలుస్తోంది. ఆయ‌న గ‌త ఎన్నిక‌ల్లోనే వెంక‌ట‌గిరి సీటు ఆశించారు. అయితే మాజీ మంత్రి ఆనం చివ‌ర్లో పార్టీలోకి రావ‌డంతో రామ్‌కుమార్ రెడ్డికి జ‌గ‌న్ సీటు ఇవ్వ‌లేదు. అయినా ఆయ‌న పార్టీ కోసం ప‌ని చేస్తూ వ‌చ్చారు. ఇటీవ‌ల తిరుప‌తి ఉప ఎన్నిక‌ల్లోనూ పార్టీ కోసం గ‌ట్టిగా క‌ష్ట‌ప‌డ్డారు. ఇక వెంక‌ట‌గిరి ఎమ్మెల్యేగా ఉన్న మాజీ మంత్రి ఆనం అటు జ‌గ‌న్ దృష్టిలోనూ, ఇటు పార్టీ నేత‌ల దృష్టిలోనూ మైన‌స్ అయిపోయారు.

పార్టీ అధిష్టానంకు వ్య‌తిరేకంగాను, జిల్లా పార్టీ నేత‌లు, మంత్రుల‌కు వ్యతిరేకంగా ఆయ‌న ప‌లు సంద‌ర్భాల్లో బ‌హిరంగంగానే గ‌ళం వినిపించారు. ఆ త‌ర్వాత జ‌గ‌న్ ఆయ‌న‌కు అపాయింట్‌మెంట్ ఇవ్వ‌నంత గ్యాప్ వ‌చ్చేసింది. ఆనం సీనియార్టీకి గుర్తించ‌లేద‌ని ఆయ‌న ర‌గిలిపోతున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల‌కు ముందే ఆయ‌న పార్టీలో ఉంటారా ? ఉండ‌రా ? అన్న సందేహాలు కూడా ఉన్నాయి. ఈ క్ర‌మంలోనే వెంక‌ట‌గిరి పార్టీ ప‌గ్గాలు ఎన్నిక‌ల‌కు యేడాది ముందే రామ్‌కుమార్ రెడ్డి ఇచ్చేందుకు జ‌గ‌న్ సుముఖంగానే ఉన్న‌ట్టు తెలుస్తోంది.

అయితే అంత‌కంటే ముందు ఆయ‌న‌కు ఎమ్మెల్సీ ఇస్తార‌ని.. నియోజ‌క‌వ‌ర్గంలో ఆనంతో పోటీగా ప్రొటోకాల్ ప‌రంగా ఇబ్బంది లేకుండా ఉండేలా చేశాకే.. రామ్‌కుమార్ రెడ్డికి వెంక‌ట‌గిరి ప‌గ్గాలు ఇస్తార‌ని టాక్ ? ఏదేమైనా మాజీ ముఖ్య‌మంత్రి కుమారుడి హోదాలో రామ్‌కుమార్‌కు జ‌గ‌న్ స‌రైన ప్రాధాన్యం ఇస్తున్నారే చెప్పాలి.