జగన్ మీద ఆశలు వదిలేసుకోవాల్సిందేనా ?

అవును తాజాగా జరుగుతున్న రాజకీయ పరిణామాలు చూస్తుంటే ఇదే అర్ధమవుతోంది. కరోనా వైరస్ సెకెండ్ వేవ్ నియంత్రణ నేపధ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోడి కొందరు ముఖ్యమంత్రులతో ఫోన్లో మాట్లాడారు. ఒడిస్సా, ఏపి, తెలంగాణా, జార్ఖండ్, పాండిచ్చేరి ముఖ్యమంత్రులతో మాట్లాడిన ప్రధాని తన మనసులోని మాటను చెప్పి సమావేశాన్ని ముగించారు. దీనిపై జార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్ కు ఒళ్ళు మండిపోయినట్లుంది.

అందుకనే సమావేశం అయిపోగానే మోడిని ఉద్దేశించి ఘాటుగా ట్వీట్ చేశారు. చెప్పదలచుకున్నది చెప్పటమే కాదు అవతల వాళ్ళు చెప్పేది కూడా వినాలంటు కాస్త గట్టిగానే మోడిని ఉద్దేశించి సోరేన్ చెప్పారు. అయితే తెరవెనుక ఏమైందో ఏమో హేమంత్ ట్వీట్ చేసిన కొద్దిసేపటిలోనే జగన్మోహన్ రెడ్డి నుండి గట్టి రిప్లై వచ్చింది. అదికూడా హేమంత్ ను తప్పుపడుతూ, మోడికి మద్దతుగా జగన్ ఓ ట్వీట్ పెట్టడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

దాంతో ఒడిస్సా ఎంపి జగన్ను ఎద్దేవా చేస్తు మరో ట్వీట్ పెట్టారు. సరే మోడికి అనుకూలంగా, మద్దతుగా ట్వీట్ల రచ్చ పెరుగుతోంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే తనంతట తానుగా జగన్ ప్రధానికి మద్దతుగా ట్వీట్ పెట్టినట్లు అనిపించటంలేదు. ఎందుకంటే హేమంత్ అన్నదాంట్లో ఏమీ తప్పులేదు. పైగా మోడి-హేమంత్ వ్యవహారంలో వేలుపెట్టాల్సిన అవసరం జగన్ కు లేదసలు. అయినా మోడికి మద్దతుగా ట్వీట్ పెట్టడాన్ని జాతీయస్ధాయిలోని ప్రతిపక్షాలు నిశితంగా గమనిస్తున్నాయి.

ఇక్కడ విషయం ఏమిటంటే మొన్ననే పశ్చిమబెంగాల్లో మమతాబెనర్జీ గెలిచారు. తమిళనాడులో స్టాలిన్ విజయంసాధించారు. అలాగే కేరళలో విజయన్ గెలిచారు. అంటే ఈ ముగ్గురు కూడా మోడికి వ్యతిరేక బ్యాచే అనటంలో సందేహంలేదు. ఈ నేపధ్యంలోనే మోడి వ్యతిరేకంగా ఉండేవాళ్ళను ఏకతాటిపైకి తేవటానికి మహారాష్ట్రలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ప్రయత్నాలు మొదలుపెట్టారు.

దివంగత సీఎం వైఎస్సార్ తో పవార్ కు బాగా సన్నిహితముండేది. దీన్ని దృష్టిలో పెట్టుకుని మోడి వ్యతిరేక బ్యాచ్ లో జగన్ కూడా కలుస్తారని ఆశించిన వాళ్ళకు తాజా పరిణామం షాక్ అనే చెప్పాలి. మోడి వ్యతిరేక బ్యాచ్ తో జగన్ చేతులు కలిపే అవకాశం దాదాపు లేదని తేలిపోయింది. తనపైన ఉన్న కేసుల కారణంగానే మోడికి వ్యతిరేకంగా జగన్ వెళ్ళే అవకాశం లేదన్న విషయం తెలిసిపోతోంది. కాబట్టి ఎవరికైనా అలాంటి ఆశలుంటే అవి వదులుకోవాల్సిందే.