కేసీఆర్ కు శుభాకాంక్షలు చెబుతూనే ట్విస్టు ఇచ్చిన షర్మిల

రాజకీయాల రూపురేఖలు మారిపోయాయి. సందర్భం ఏదైనా సరే.. ఏదో ఒక ట్విస్టు ఇవ్వకపోతే మనసు అస్సలు ఊరుకోని పరిస్థితి. ప్రత్యేక సందర్భాల్లో తెలిపే శుభాకాంక్షల్లోనూ ఏదో ఒక ట్విస్టు ఇవ్వటం ఇటీవల కాలంలో ఎక్కువైంది. మిగిలిన సమయాల్లో రాజకీయాన్ని చేసే నేతలు.. ప్రత్యేక సందర్భాల్లోనూ అదే తీరును ప్రదర్శించటం సరికాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఇందుకు నిదర్శనంగా వైఎస్ షర్మిల ఉదంతాన్ని చెప్పాలి. ఇటీవల జరిగిన నాగార్జున సాగర్ ఉప ఎన్నికల ఫలితం ఆదివారం వెలువడటం తెలిసిందే. ముందుగా ఊహించిన రీతిలోనే టీఆర్ఎస్ పార్టీ విజయాన్ని సాధించింది. ఈ సందర్భంగా శుభాకాంక్షలు చెప్పిన షర్మిల.. తనదైన పంచ్ ను కేసీఆర్ కు వేసే ప్రయత్నం చేశారు.

‘ఉధృతంగా ఉన్న కరోనా సెకండ్‌వేవ్‌ వ్యాప్తిని సైతం లెక్కచేయకుండా నాగార్జునసాగర్‌ ఉపఎన్నికలో విజయాన్ని సొంతం చేసుకున్న కేసీఆర్‌కు శుభాకాంక్షలు’ అంటూ ట్వీట్ చేయటమే ఇందుకు నిదర్శనం. ఇక్కడితో ఆగితే షర్మిల గురించి స్పెషల్ గా చెప్పుకోవాల్సిన పని లేదు. తానుచేసిన ట్వీట్ కు అంతో ఇంతో రాజకీయ ప్రయోజనం లభించాలన్న ధోరణితో ఆమె మరో అంశాన్ని ప్రస్తావించారు. ఇలాంటి ఆనందకరమైన సమయంలో అయినా కరోనాను ఆరోగ్యశ్రీ జాబితాలో చేర్చాలని తాను కోరుకున్నట్లుగా పేర్కొన్నారు. మొత్తానికి ఏదో విధంగా తన ఎజెండాను తెర మీదకు తీసుకొచ్చేందుకు షర్మిల ప్రయత్నం చేస్తుండటం గమనార్హం.