ఎల్జీ పాలిమర్స్ ఎదుట ధర్నా- 50 మందిపై కేసు

తీవ్ర విషాదకరమైన వైజాగ్ గ్యాస్ లీకేజీ ఘటన అనంతరం స్థానికులు అయిన బాధితులు కొందరు కంపెనీ మూసేయాలంటే దాని ఎటు ధర్నా చేసిన సంగతి తెలిసిందే. వరుసగా రెండు మూడు రోజులు పలుమార్లు ఈ ధర్నాలు జరిగాయి. అయితే, ఈ ధర్నాలో పాల్గొన్న 50 మందిపై పోలీసు కేసులు నమోదవడం పెద్ద చర్చనీయాంశం అయ్యింది.

ఎల్జీ పాలిమర్స్ ప్యాక్టరీ ఆర్ఆర్ వెంకటాపురం ప్రాంతంలో ఉంది. ఈ ఏరియా మొత్తం గోపాలపట్నం పోలీస్ స్టేషను పరిధిలోకి వస్తుంది. ఆందోళనకారులకు పలుమార్లు సర్ది చెప్పినా, ప్రభుత్వం అన్ని చర్యలకు హామీ ఇచ్చినా ధర్నా విరమించలేదు. అందుకే వారిపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. పైగా అక్కడ లాక్ డౌన్ నిబంధనలతో పాటు, ఆ ప్రాంతాన్ని శుభ్రం చేసేవరకు రావొద్దని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇవన్నీ ఉల్లంఘించారన్నది పోలీసుల వాదన.

అయితే… మృతుల్లోని ఒక చిన్నారి తల్లి లత ధర్నా సందర్భంగా పోలీసు భద్రతను దాటుకుని కంపెనీ గేటుదాటుకుని లోపలకు వెళ్లింది. అనంతరం ఆమెను పోలీసులు బలవంతంగా బయటకు తరలించారు. సోషల్ మీడియాలో ఈమెపై కేసు నమోదైనట్లు, ఆమెను జైలుకు పంపినట్లు వదంతులు ప్రచారమవగా విశాఖపట్నం డీసీపీ-2 ఉదయ్ భాస్కర్ దీనిని కొట్టిపారేశారు. చనిపోయిన చిన్నారి తల్లి లతపై ఏ కేసు నమోదు చేయలేదని ఆయన స్పష్టంచేశారు. ఫేక్ వార్తలు ప్రచారం చేయడం నేరం అని హెచ్చరించారు.