సాగ‌ర్‌, తిరుప‌తి రిజ‌ల్ట్ వ‌చ్చిన వెంట‌నే ఈ ఎమ్మెల్యేలూ కూడా జంపే ?


రెండు తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నిక‌లు ముగిసిన‌ప్ప‌టి నుంచి అధికార పార్టీల్లోకి ప్ర‌జా ప్ర‌తినిధుల జంపింగ్‌లు కంటిన్యూగా సాగాయి. తెలంగాణ‌లో అయితే కాంగ్రెస్ నుంచి గెలిచిన 12 మంది ఎమ్మెల్యేలు, టీడీపీ నుంచి గెలిచిన ఇద్ద‌రు ఎమ్మెల్యేలు కారెక్కేశారు. వారం రోజుల క్రిత‌మే అశ్వారావుపేట టీడీపీ ఎమ్మెల్యే మ‌చ్చా నాగేశ్వ‌ర‌రావు సైతం గులాబి గూటికి చేరిపోయారు. తెలంగాణ‌లో జంపింగ్‌ల వార్త‌ల‌కు బ్రేక్ పడేలా లేదు. ఇక ఏపీలోనూ టీడీపీ నుంచి గెలిచిన న‌లుగురు ఎమ్మెల్యేలు ఫ్యాన్ కింద అధికారికంగానో, అన‌ధికారికంగానో సేద తీరుతున్నారు.

ఇక ఏపీలో దాదాపు ఆరేడు నెల‌లుగా టీడీపీలో కొంద‌రు ఎమ్మెల్యేల‌తో పాటు ప‌లువురు కీల‌క నేత‌లు స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు, తిరుపతి ఉప ఎన్నిక ఫ‌లితం కోస‌మే ఎదురు చూస్తున్నారు. ఈ ఫ‌లితాలు చూసుకుని జంప్ చేసేయాల‌న్న నిర్ణ‌యానికి చాలా మంది వ‌చ్చేశార‌నే అంటున్నారు. ఇప్ప‌టికే స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల ఫ‌లితాల‌తో టీడీపీలో కొంద‌రు ఎమ్మెల్యేల‌కు భ‌విష్య‌త్తుపై ఆశ‌లేక సైలెంట్ అయిపోయారు. రేపు తిరుప‌తి ఫ‌లితం కూడా ఏ మాత్రం ఆశాజ‌న‌కంగా ఉండ‌ద‌న్న నిర్ణ‌యానికి వారు వ‌చ్చేశార‌ట‌.

తిరుప‌తి ఫ‌లితం వ‌చ్చిన వెంట‌నే టీడీపీ నుంచి మ‌రో న‌లుగురు ఎమ్మెల్యేల‌తో పాటు ముగ్గురు మాజీ మంత్రులు సైతం ఫ్యాన్ కింద‌కు వెళ్లిపోయేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నార‌ట‌. వీరు అధికార పార్టీ కీల‌క నేత‌ల‌తో కొద్ది రోజుల నుంచే ట‌చ్‌లో ఉంటున్నార‌ని కూడా పార్టీ నేత‌లే సందేహిస్తున్నారు. తిరుప‌తి ఫ‌లితం వ‌చ్చిన వెంట‌నే వారు టీడీపీని వీడిపోనున్నారు. ఇక తెలంగాణ‌లో అశ్వారావుపేట ఎమ్మెల్యే బాట‌లోనే కాంగ్రెస్‌కు చెందిన ఇద్ద‌రు ఎమ్మెల్యేలు కారెక్కేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు.

వీరిలో ఒక ఎమ్మెల్యే & మాజీ మంత్రి కూడా ఉండ‌డం మ‌రో విశేషం. ఇక మ‌రో సీనియ‌ర్ ఎమ్మెల్యే కూడా అదే బాట‌లో ఉన్నార‌ట‌. వీరు సాగ‌ర్ ఫ‌లితం వ‌చ్చిన వెంట‌నే పార్టీ మారే అవ‌కాశాలు ఉన్నాయంటున్నారు. వీరిద్ద‌రికి ఇప్పుడు పార్టీలో ప్రాధాన్య‌త‌తో పాటు వ‌చ్చే ఎన్నిక‌ల్లో తిరిగి సిట్టింగ్ సీట్లు కేటాయిస్తామ‌న్న ఆఫ‌ర్లు అధికార పార్టీ నుంచి వెళ్లిపోయాయంటున్నారు. వీరిద్ద‌రే కాదు.. మ‌రి కొంద‌రు కూడా అదే బాట‌లో ఉండ‌డంతో సాగ‌ర్ ఉప ఎన్నిక కోసం ఏ మాత్రం క‌ష్ట‌ప‌డ‌లేద‌ని అంటున్నారు. ఇక కాంగ్రెస్ నుంచే కొంద‌రు కీల‌క నేత‌లు బీజేపీ వైపు చూస్తోన్న ప‌రిస్థితి కూడా ఉంది. ఏదేమైనా సాగ‌ర్‌, తిరుప‌తి ఫ‌లితాల త‌ర్వాత మ‌ళ్లీ తెలుగు రాజ‌కీయాలు వేడెక్క‌నున్నాయి.