ఎయిర్ పోర్టు ఓపెనింగ్.. కీలక వ్యాఖ్య చేసిన జగన్

ఒక ఎయిర్ పోర్టుకు రెండు ప్రారంభోత్సవాలా? అంటూ కొందరి విమర్శల నడుమ.. కర్నూలుకు దగ్గర్లోని ఓర్వకల్లులో నిర్మించిన ఎయిర్ పోర్టును ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఏళ్లకు ఏళ్లుగా కర్నూలు ఎయిర్ పోర్టు కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మంది కల నేటికి తీరింది. చంద్రబాబు హయాంలోనే నిర్మాణం మొదలై పూర్తి చేసుకున్న ఈ ఎయిర్ పోర్టులో మరో మూడు రోజుల్లో ప్రయాణికుల రాకపోకలు ప్రారంభం కానున్నాయి.

విమానాశ్రయాన్ని ప్రారంభించిన సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. న్యాయ రాజధానికి రాకపోకలు సాగేలా ఈ ఎయిర్ పోర్టు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. దీంతో.. మూడు రాజధానుల అంశంపై తాను పక్కకు వెళ్లలేదన్న విషయాన్ని ఆయన స్పష్టం చేశారు. అంతేకాదు..రానున్న రోజుల్లో ఏపీ హైకోర్టు తరలింపు ఖాయమన్నసంకేతాల్ని ఇచ్చినట్లైంది.

తాజాగా ప్రారంభించిన విమానాశ్రయంతో రాష్ట్రంలో ఆరో విమానాశ్రయంగా పేర్కొన్న జగన్.. న్యాయ రాజధాని నుంచి మిగిలిన రాష్ట్రాలకు ఓర్వకల్లు విమానాశ్రయం కలుపుతుందన్నారు. అంతేకాదు.. ఎయిర్ పోర్టుకు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరును పెట్టటం ద్వారా భావోద్వేగ అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చారు.

ఎయిర్ పోర్టు ప్రారంభం కాక ముందే.. ఎన్నికల్లో లబ్థి పొందేందుకు చంద్రబాబు ఎయిర్ పోర్టును ప్రారంభించినట్లుగా విమర్శలు సంధించారు. రూ.110 కోట్లతో అన్ని హంగుల్ని ఎయిర్ పోర్టు తీర్చిదిద్దినట్లు చెప్పారు. అంతా బాగానే ఉంది కానీ.. రెండేళ్ల క్రితమే చంద్రబాబు ఓపెన్ చేస్తే.. ఇన్నాళ్లకు ఎందుకు ప్రారంభించినట్లు? ముందే ఈ పని ఎందుకు కానట్లు? అన్న ప్రశ్నకు జగన్ ఏమని బదులిస్తారో?