జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ‌కు లైన్ క్లియ‌ర్‌.. జ‌గ‌న్ ఫిర్యాదులు బుట్ట‌దాఖ‌లు..

సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణకు లైన్ క్లియ‌ర్ అయింది. సుప్రీం కోర్టు త‌దుప‌రి ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా ఆయ‌న వ‌చ్చే నెల‌లో బాధ్య‌త‌లు స్వీక‌రించ‌నున్నారు. అయితే.. జ‌స్టిస్ ఎన్వీర‌మ‌ణ‌పై ఏపీ సీఎం జ‌గ‌న్‌ చేసిన ఫిర్యాదు కొన్నాళ్ల కింద‌ట దేశ‌వ్యాప్తంగా తీవ్ర‌స్థాయిలో సంచ‌ల‌నం సృష్టించింది. జ‌స్టిస్ ఎన్వీర‌మ‌ణ కుటుంబంపై సీఎం జ‌గ‌న్ ఏకంగా సుప్రీం సీజే బాబ్డేకు ఫిర్యాదు చేశారు. దీనిపై అంత‌ర్గ‌తంగా విచార‌ణ జ‌రిపిన సుప్రీ కోర్టు ధ‌ర్మాస‌నం.. అమరావతి భూముల విషయంలో చేసిన ఈ ఫిర్యాదుపై నిబంధనల ప్రకారం ఇన్-హౌస్ విచారణ జరిపినట్లు సుప్రీంకోర్టు తాజాగా విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.

సుప్రీంకోర్టు విడుదల చేసిన ప్రకటనలో తెలిపిన వివరాల ప్రకారం, అమరావతి భూముల విషయంలో జస్టిస్ ఎన్‌వీ రమణపై ఏపీ సీఎం జ‌గ‌న్‌ 2020 అక్టోబరు 6న సుప్రీంకోర్టుకు ఫిర్యాదు చేశారు. దీనిపై ఇన్-హౌస్ ప్రొసీజర్‌లో విచారణ జరిపి, తగిన విధంగా పరిశీలించి, సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఈ ఇన్-హౌస్ ప్రొసీజర్ అత్యంత రహస్యమైనది, ఈ వివరాలు బహిరంగంగా వెల్లడించదగినవి కాదు. ఈ ఆరోపణలను అఫిడవిట్ ద్వారా కూడా జగన్ సుప్రీంకోర్టుకు సమర్పించారు.

ఫిర్య‌దులో ఏం పేర్కొన్నారంటే..
”చంద్రబాబు, జస్టిస్ రమణల మధ్య సాన్నిహిత్యం అందరికీ తెలిసిందే. నేను(సీఎం జ‌గ‌న్‌) ఎంతో బాధ్యతాయుతంగా ఈ మాట చెబుతున్నాను. గతంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ చలమేశ్వర్ ఈ విషయాలను సాక్ష్యాలతో సహా బయట పెట్టారు. హైకోర్టు న్యాయమూర్తుల నియామకాల్లో బాబు, జస్టిస్ రమణలు ఇచ్చిన అభిప్రాయాలను మీముందు ఉంచుతున్నాను. టీడీపీకి ముఖ్యమైన విషయాలు వచ్చినప్పుడు హైకోర్టు జడ్జీల డ్యూటీ రొటేషన్‌ను(జడ్జీల రోస్టర్) జస్టిస్ రమణ ప్రభావితం చేస్తున్నారు. హైకోర్టు సిట్టింగులను ప్రభావితం చేస్తున్నారు. ఇది స్పష్టంగా కొందరు జడ్జీలు, జస్టిస్ రమణ, తెలుగుదేశం పార్టీల మధ్య సంబంధాన్ని తెలుపుతోంది. ఈ అంశాలు పరిశీలించి, న్యాయ వ్యవస్థ నిష్పక్షపాతంగా ఉంటడానికి మీరు తగిన చర్యలు తీసుకోవాలి” అని భారత ప్రధాన న్యాయమూర్తిని సీఎం జ‌గ‌న్ కోరారు.

ఇంకా ఏం చెప్పారంటే..
సీఎం జ‌గ‌న్ త‌న ఫిర్యాదులో.. పలువురు న్యాయవాదులను హైకోర్టు న్యాయమూర్తులుగా ఎలివేట్ చేయడానికి జస్టిస్ ఎన్‌వీ రమణ, చంద్రబాబునాయుడు ఇచ్చిన అభిప్రాయాలూ, 2013-16 మధ్య జస్టిస్ రమణ ఆస్తుల డిక్లరేషన్, హైకోర్టు గ్యాగ్ ఆర్డర్ ఉన్న ఎఫ్ఐఆర్ వివరాలూ, ఆ ఎఫ్ఐఆర్ కాపీ, కేబినెట్ సబ్ కమిటీపై హైకోర్టు ఇచ్చిన రిట్ పిటీషన్లో ఇచ్చిన ఆదేశాలు, ఏపీ హైకోర్టు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఇచ్చిన తీర్పు అని ఆరోపిస్తున్న ఆదేశాలు వీటిల్లో జత చేశారు.

జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ‌కు లైన్ క్లియ‌ర్‌!
సుప్రీం ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎస్‌ఏ బాబ్డే వచ్చే నెలలో పదవీ విరమణ చేయబోతున్నారు. తదుపరి సీజేఐగా జస్టిస్ ఎన్‌వీ రమణను నియమించాలని జస్టిస్ బాబ్డే కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేశారు. రాష్ట్రపతి ఆమోదం తర్వాత ఏప్రిల్ 24న జస్టిస్ రమణ సీజేఐగా ప్రమాణ స్వీకారం చేస్తారు. దీంతో జ‌గ‌న్ చేసిన ఫిర్యాదులు వ‌ట్టివేన‌ని స్ప‌ష్ట‌మైంది. మ‌రి ఇప్పుడు వైసీపీ నాయ‌కులు ఏం చెబుతారో చూడాలి.