అర్ధంలేని గంటా లాజిక్

మాజీమంత్రి, విశాఖ ఉత్తరం టీడీపీ ఎంఎల్ఏ గంటా శ్రీనివాసరావు విచిత్రమైన లాజిక్ లేవదీశారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు అన్నీ పార్టీలు రెడీ అవ్వాలన్నారు. అందరు రాజీనామాలు చేయాలని గంటా చెప్పారు. 175 మంది ఎంఎల్ఏలు, 25 ఎంపీలు, ఎంఎల్సీలందరు వెంటనే రాజీనామాలు చేయాలని సూచించారు. తాము చెప్పినట్లుగా అందరు రాజీనామాలు చేస్తే యావత్ దేశం మనవైపే చూస్తుందని చెప్పారు. అందరు రాజీనామాలు చేస్తేనే ఉపయోగం ఉంటుందని చెప్పటం కూడా కరెక్టేనేమో.

కానీ తర్వాత చెప్పిన మాటే విచిత్రంగా ఉంది. ఇంతకీ అదేమిటంటే వైసీపీ సభ్యులు రాజీనామాలు చేసిన చోట్ల తెలుగుదేశంపార్టీ పోటీ పెట్టదని అచ్చెన్న, గంటా చెప్పారు. అసలు ఈ మాట చెప్పటానికి గంటాకున్న అర్హత ఏమిటనేదే సందేహం. ఎందుకంటే ఈ మాట చెప్పాల్సింది గంటా కాదు చంద్రబాబునాయుడు. అలాంటిది ఏ పార్టీలో ఉన్నారో కూడా స్పష్టత లేని గంటా చెబితే నమ్మేవాళ్ళెవరు లేరు.

ఇక గంటా చెప్పిందే నిజమని కాసేపు అనుకుందాం. ఇపుడు రాజీనామా చేసిన స్ధానాలకు ఎన్నికలు జరిగినపుడు టీడీపీ పోటీ పెట్టదన్నారు. అంటే వైసీపీ సభ్యులు చేసే రాజీనామాలు ఆమోదం పొంది తర్వాత ఉపఎన్నికలు జరిగితే అప్పుడు టీడీపీ పోటీ పెట్టదట. టీడీపీ పోటీ పెట్టదు బాగానే ఉంది మరి బీజేపీ+జనసేన మాటేమిటి ? కాంగ్రెస్, వామపక్షాలు కూడా పోటీకి దూరంగా ఉంటాయా ?

పోనీ గంటా మాట మీద గౌరవం ఉంచి పై పార్టీలు కూడా దూరంగా ఉండి వైసీపీ అభ్యర్ధులనే గెలిపిస్తాయని అనుకుందాం. అంటే ఎలాంటి పోటీ లేకుండానే వైసీపీ అభ్యర్ధులు మళ్ళీ గెలుస్తారు. మరలాంటపుడు ఇపుడు రాజీనామాలు చేసి పోటీలేకుండా పోటీ చేసి మళ్ళీ గెలవటం ఎందుకు ? ఇపుడు రాజీనామాలు చేయకుండా ఉంటే అసలు ఉపఎన్నికల అవసరమే ఉండదు కదా. గంటా చెప్పినట్లే టీడీపీ పోటీ పెట్టకపోయినా మరి టీడీపీ పోటీ చేసే స్ధానాల్లో వైసీపీ పోటీ చేయకుండా ఉంటుందా ? ఏదో నోటికొచ్చింది మాట్లాడేసినట్లుందే కానీ లాజిక్ ఉపయోగించినట్లు లేదు గంటా మాటలు.