టీడీపీ యువనేత మాగంటి రాంజీ కన్నుమూత

సినీ.. రాజకీయ రంగాల్లో సుపరిచితుడు.. భోళా మనిషి ఏలూరు మాజీ ఎంపీకి పెద్ద కష్టమే వచ్చింది. ఎదిగిన కొడుకు అనారోగ్యానికి గురి కావటమే కాదు.. తాజాగా మరణించిన వైనం ఆ కుటుంబాన్ని తీవ్రంగా వేధిస్తోంది. టీడీపీ సీనియర్ నేత మాగంటి బాబు కుమారుడు మాగంటి రాంజీ (37) ఆదివారం రాత్రి కన్నుమూశారు. కొద్దిరోజులుగా ఆయన్ను ఏలూరు ఆసుపత్రిలో చికిత్స చేస్తున్నారు.

మెరుగైన వైద్యం కోసం విజయవాడలోని ఆంధ్రా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న వేళ.. పరిస్థితి విషమించటంతో ఆదివారం రాత్రి మరణించారు. రాంజీ అనారోగ్యానికి కారణం ఏమిటన్నది బయటకు రాలేదు. వాస్తవానికి రాంజీ ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లుగా ప్రచారం జరిగింది. అయితే.. దానికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడలేదు. ఆయన మరణంపై కుటుంబ సభ్యులు స్పందించలేదు. టీడీపీ యువనేతగా కొనసాగుతున్న రాంజీ..సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాడు. వారం క్రితం కూడా రాంజీ ట్విటర్ లో పోస్టులు చేశారు. అలాంటి యువనేత.. అకస్మాత్తుగా మరణించటాన్ని పార్టీవర్గాలు జీర్ణించుకోలేకపోతున్నాయి.

ఇదిలా ఉంటే.. రాంజీ శరీర అవయువాల్ని దానం చేయటానికి కుటుంబ సభ్యులు అంగీకరించారు. ఈ ప్రక్రియ పూర్తి అయిన తర్వాత రాంజీ భౌతికకాయాన్ని సోమవారం ఉదయం ఏలూరులోని వారింటికి తీసుకెళ్లనున్నారు. దీంతో మాగంటి బాబు కుటుంబం తీవ్ర విషాదంలో చిక్కుకుంది. ఆయనకు రాజకీయ.. సినీ రంగానికి చెందిన పలువురు సంతాపాన్ని తెలియజేస్తున్నారు.
ఇలాంటి కష్టం మరెవరికీ రావొద్దని కోరుకుంటున్నారు. అతడి మరణంపై పలువురు సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఒక క్రియాశీలక.. ఎంతో భవిష్యత్తు ఉన్న యువనాయకుడ్ని పార్టీ కోల్పోయింది. ఆయన మరణానికి అశ్రునివాళి ఘటిస్తున్నామని టీడీపీ ట్విటర్ లో పోస్టు చేయగా.. పార్టీముఖ్యనేత నారా లోకేశ్ సైతం ట్వీట్ చేశారు. లోకేశ్ అన్నా అంటూ పిలిచే ఆ పిలుపు ఇక వినబడదు.. మాగంటి రాంజీ మనకు దూరమయ్యాడని ఆవేదన వ్యక్తం చేశారు. ‘తెలుగుదేశానికి అండగా ఉంటానంటూ జెండా పట్టిన పసుపు సైనికుడా.. నీ మరణం పార్టీకి.. నాకు తీరని లోటు’ అని లోకేశ్ ట్వీట్ చేశారు.