నిజమా? విశాఖ గెలుపు కోసం జగన్ అన్న మాటల్ని చెప్పిన ఆర్కే

ఏపీలో జరుగుతున్న ఎన్నికలకు సంబంధించి వస్తున్న వార్తలు కాస్త చిత్రంగా ఉంటున్నాయి. ఎవరికి అనుకూలంగా వారు రాసుకుంటున్నారు. అధికారపక్షం దెబ్బకు విపక్షాలకు అభ్యర్థులు దొరకని పరిస్థితి. ఒకవేళ.. ఎవరైనా బరిలో ఉంటే వారికి చుక్కలు చూపిస్తున్న వైనం కథలు..కథలుగా వార్తల రూపంలో వస్తున్నాయి. ఇదిలా ఉంటే ఏపీ అధికారపక్షానికి చెందిన సాక్షి పత్రికలో మరో విధమైన వార్తలు వస్తున్నాయి. విపక్ష టీడీపీ నేతలు చెలరేగిపోతున్నారని.. అధికార పార్టీ నేతల్ని బెదిరిస్తున్నారని.. దౌర్జన్యాలకు పాల్పడుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

ఎక్కడి సంగతేమో కానీ.. ఏపీలో విపక్ష నేతలకు అధికారపక్ష నేతల్ని ఎదిరించేంత సీన్ ఉందా? నిజంగా అలా ఉంటే సీఎం జగన్ ఊరుకుంటారా? నిజానికి జగన్ మాత్రమే కాదు..అధికారం చేతిలో ఉన్న ఏ ముఖ్యమంత్రి ఒప్పుకోరు. ఇలా..ఏపీ మీడియాలో వస్తున్న వార్తలు మహా చిత్రంగా ఉంటున్నాయి.

ఇలాంటివేళ.. ఆంధ్రజ్యోతి అధినేత ఆర్కే తాజాగా తన కాలమ్ లో విశాఖ ఎన్నికకు సంబంధించి.. సొంత పార్టీ నేతలతో సీఎం జగన్మోహన్ రెడ్డి ఎలాంటి వార్నింగ్ ఇచ్చారో వివరంగా రాసుకొచ్చారు. అందులో నిజం మాట ఏమిటన్న సందేహం ఒక పక్క.. పత్రికాధిపతి తన సొంత కాలమ్ లో రాసుకొచ్చిన విషయంలో అంతో ఇంతో నిజం ఉండకుండద ఉంటుందా? అన్నది మరో ప్రశ్న. ఇంతకూ విశాఖలో జరుగుతున్న నగర పాలక సంస్థ ఎన్నికల్లో విజయం కోసం జగన్ ఎంతలా ఆరాటపడుతున్న విషయాన్ని ఆర్కే తన కాలమ్ లో ఏం చెప్పారో ఆయన అక్షరాల్లోనే చూస్తే..

  • పంచాయతీరాజ్‌ వ్యవస్థను పటిష్ఠం చేయడానికి చట్టాలు చేసి, ‘మీ ప్రాంతాన్ని మీరే పాలించుకోండి’ అని ప్రజలకు అవకాశం కల్పించారు. అయితే, ఏపీలో ఇప్పుడు ఇందుకు పూర్తి భిన్నంగా జరిగింది, జరుగుతోంది. తమ ప్రతినిధిని ఎన్నుకునే అవకాశం ప్రజలకు ఇవ్వకుండా సర్పంచులుగా ఎవరుండాలో పాలకులే నిర్ణయించారు. ఇప్పుడు జరుగుతున్న మునిసిపల్‌ ఎన్నికల్లోనూ ఇదే తంతు! ప్రత్యర్థి పార్టీలకు అభ్యర్థులే దొరక్కుండా చేస్తున్నారు. ఎవరైనా ముందుకొచ్చి నామినేషన్లు వేసినా, దాన్ని ఉపసంహరించుకోకపోతే చంపుతామని హెచ్చరికలు చేస్తున్నారు. ప్రత్యర్థి పార్టీలకు ఓటు వేసే అవకాశం ఉందన్న అనుమానం కలిగిన వారిపై నిఘా పెడుతున్నారు. అధికార పార్టీని కాదంటే ఏం చేస్తారో చెప్పి భయపెడుతున్నారు. మొత్తమ్మీద ప్రజాస్వామ్యం అన్న పదానికి నిర్వచనాన్నే మార్చి పడేశారు.
  • విశాఖపట్నం నగర పాలక సంస్థ ఎన్నికల్లో ఓడిపోతే మంత్రులు వాళ్ల ముఖాలను కూడా తనకు చూపించాల్సిన అవసరం లేదని, అక్కడి నుంచే రాజీనామాలు చేయాలని జగన్మోహన్‌ రెడ్డి తీవ్రంగా హెచ్చరించారట! అంతే కాదు… తాను ఎగ్జిక్యూటివ్‌ కేపిటల్‌గా ప్రకటించిన విశాఖను గెలిపించుకోలేకపోతే శాసనసభను సైతం రద్దు చేయడానికి వెనుకాడనని ముఖ్యమంత్రి అల్టిమేటం కూడా ఇచ్చారని చెబుతున్నారు. ‘‘మీరు ఏం చేస్తారో నాకు తెలియదు. విశాఖలో గెలిచితీరాలి. ఈ విషయంలో మీ చర్యలను విమర్శిస్తూ మీడియాలో వార్తలు వచ్చినా నేను పట్టించుకోను. మీరు మంచివాళ్లుగా ఉండటం కంటే ప్రత్యర్థులను కట్టడి చేయడానికి అరాచకంగా వ్యవహరించడాన్నే ఇష్టపడతాను’’ అని మంత్రులు, శాసనసభ్యులను ఉద్దేశించి జగన్‌ రెడ్డి అన్నారని వినబడుతోంది. జగన్‌ రెడ్డి నిర్వచిస్తున్న ప్రజాస్వామ్యం ఇది!
  • ముఖ్యమంత్రి అంతరంగం అవగతం కావడంతో ఎంపీ విజయసాయి రెడ్డి నాయకత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేలు రెచ్చిపోతున్నారు. సామ దాన భేద దండోపాయాలతోపాటు మాయోపాయాన్ని కూడా అమలు చేస్తున్నారు. ప్రతిపక్షాలను, ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును సంస్కార హీనంగా దూషిస్తున్న మంత్రులను ముఖ్యమంత్రి ఎందుకు కట్టడి చేయడం లేదు అని కొంతమంది అమాయకులు ప్రశ్నిస్తున్నారు గానీ, చంద్రబాబును ఎంత తిడితే జగన్‌ అంత సంతోషిస్తారని ఇప్పుడు తెలుస్తోంది. ద్వాపర యుగాంతంలో కలి పురుషుడు చెప్పినదానికంటే దారుణంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితులు ఉన్నాయి. జగన్‌ రెడ్డి ముఖంలో కనిపించే నవ్వులో ఎగతాళి కనిపిస్తోంది. తనకు నలభై ఏళ్ల రాజకీయ అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు నాయుడు ఇప్పుడు చేతగానివాడుగా మిగిలిపోయారు.