వైసీపీకి తండ్రి, కొడుకులే ప్రచారం చేస్తున్నారా ?

మామూలుగా ప్రతిపక్షం చేసే పనేమిటంటే తాము అధికారంలోకి వస్తే ఏమి చేస్తాము, అధికారంలో ఉన్నపుడు ఏమి చేశామనే విషయాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తుంటుంది. వీలైనంతలో అధికారపార్టీని లేదా ముఖ్యమంత్రి స్ధానంలో కూర్చున్న నేత ప్రస్తావన తేకుండా జాగ్రత్తపడుతుంది. ఏదో సమయం, సందర్భం వస్తే మాత్రం అధికారపార్టీ+సీఎంను వదలకుండా ఉతికి వదిలిపెడుతుంది.

కానీ గడచిన రెండేళ్ళుగా ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశంపార్టీ మాత్రం రివర్సులో నడుస్తోంది. చంద్రబాబునాయుడు, లోకేష్ అండ్ కో మాత్రం పొద్దున లేచింది మొదలు రాత్రి పడుకునేంత వరకు వైసీపీని లేదా జగన్మోహన్ రెడ్డినే ప్రధానంగా టార్గెట్ చేస్తోంది. రాష్ట్రంలో ఎక్కడ ఏ సంఘటన జరిగినా వెంటనే దానికి జగన్ పాలనకు ముడి పెట్టేసి చంద్రబాబు+లోకేష్ తీవ్రస్ధాయిలో విరుచుకుపడిపోతున్నారు.

రోడ్డు షో నిర్వహించినా, సభపెట్టినా, మీడియా సమావేశంలో కూడా చివరకు జగన్ నామస్మరణ తప్ప మరోటి కనబడటం లేదు. నిజానికి మొన్నటి ఎన్నికల్లో జగన్ దెబ్బకు టీడీపీ కుదేలైపోయింది, జిల్లాలకు జిల్లాలే అడ్రస్ లేకుండా పోయింది. ఉత్తరాంధ్రలో విజయనగరం, రాయలసీమలో కడప, కర్నూలు, కోస్తాలో నెల్లూరు జిల్లాల్లో ఒక్కటంటే ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. ఇలాంటి పరిస్ధితుల్లో పార్టీని బలోపేతం చేయటంపై చంద్రబాబు దృష్టి పెట్టాలి.

పార్టీకి గుదిబండలుగా మారిన సీనియర్ నేతలను పక్కన పెట్టేసి యువనేతలను ప్రోత్సహించాలి. కానీ చంద్రబాబు దానికి భిన్నంగా నడుస్తున్నారు. పార్టీ బలోపేతం చేయాల్సిన విషయాన్ని పక్కనపెట్టేసి ఎంతసేపు అధికారపార్టీతో పాటు జగన్నే టార్గెట్ గా చేసుకుంటున్నారు. చంద్రబాబు మరచిపోయిన విషయం ఏమిటంటే జగన్ను టార్గెట్ చేస్తే టీడీపీ బలపడదు.

ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తేనే జనాల్లో టీడీపీపై నమ్మకం పెరుగుతుందన్న చిన్న విషయాన్ని కూడా చంద్రబాబు మరచిపోయారు. ఒకవేళ ప్రభుత్వంపై ఇప్పటికిప్పుడు వ్యతిరేకత లేదని అనుకున్నా వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. ఈలోగా టీడీపీ బలోపేతానికి అవసరమైన సంస్ధాగత చర్యలు తీసుకోవాలి. ఈమధ్యనే ముగిసిన, ఇపుడు జరుగుతున్న మున్సిపల్ ఎన్నికలనే తీసుకుంటే చంద్రబాబు బాగా తప్పులు చేస్తున్నారు.

స్ధానికసంస్ధల ఎన్నికల్లో అధికారపార్టీకే మొగ్గుంటుందన్న విషయం అందరికీ తెలిసిందే. మరి ఈ ఎన్నికల్లో ఎలాగైనా వైసీపీని చిత్తు చేయాలని చంద్రబాబు పిలుపివ్వటంలో అర్ధమేలేదు. నిజంగానే జగన్ పై వ్యతిరేకతుంటే జనాలే టీడీపీని ఆధరిస్తారు. వ్యతిరేకత లేదంటే టీడీపీని పట్టించుకోరు. ఇపుడు చాలాచోట్ల జరుగుతున్నది ఇదే. అనవసరంగా పంచాయితి, మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ ఓటమిని సవాలుగా తీసుకుని చంద్రబాబు భంగపడటం తప్ప ఉపయోగంలేదు.

వైసీపీ, జగన్ మీద పెట్టే దృష్టిలో సగం పెడితే టీడీపీ బలోపేతమవుతుంది. చూడబోతే 24 గంటలూ ప్రభుత్వంపై బురద చల్లేస్తున్న కారణంగా తండ్రీ, కొడుకులే జగన్ కు ప్రచారం చేస్తున్నారనిపిస్తోంది. మరి ఈ విషయాన్ని కాస్త ఆలోచిస్తారా ?