గెలుపు సరే… ఈ లాజిక్ మిస్సయ్యావ్ అచ్చెన్నా ?


తెలుగుదేశంపార్టీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు వైఖరి విచిత్రంగా ఉంది. సొంతూరు నిమ్మాడ గ్రామ పంచాయితీ ఎన్నికల్లో నామినేషన్ దాఖలు సందర్భంగా అయిన గొడవలో పోలీసులు అచ్చెన్నను అరెస్టు చేసిన విషయం అందరికీ తెలిసిందే. మంగళవారం జరిగిన పోలింగ్ సందర్భంగా జైలు నుండి విడుదలైన తర్వాత, ఫలితాలు వచ్చిన తర్వాత అచ్చెన్న మాటలే చాలా విచిత్రంగా ఉంది.

తమ పంచాయితి నిమ్మాడలో గడచిన 40 ఏళ్ళుగా ఎప్పుడు ఎన్నికలు జరగలేదని, అంతా ఏకగ్రీవంగానే జరిగిందన్నారు. తాజాగా తమ కుటుంబంలో వైసీపీ చిచ్చుపెట్టి ఏకగ్రీవం అవ్వాల్సిన ఎన్నికలను ఎన్నికల దాకా తీసుకొచ్చిందంటు మండిపోయారు. నిమ్మాడలో సర్పంచ్ పదవికి జరిగిన ఎన్నికల్లో కింజరాపు ఫ్యామిలీ మెంబరే గెలిచారు లేండి. వైసీపీ తరపున పోటీ చేసిన కింజరాపు అప్పలనాయుడు ఓడిపోయారు.

ఎన్నికలన్నాక గెలుపు ఓటములు చాలా సహజం. అయితే నిమ్మాడ పంచాయితీపై కింజరాపు కుటుంబం తమ పట్టును కంటిన్యు చేస్తోంది. ఇందుకు అచ్చెన్నను అభినందించాల్సిందే. తమ అభ్యర్ధిని గెలిపించుకునేందకు అధికారపార్టీ వైపునుండి చాలా ఒత్తిళ్ళే ఎదురయ్యుంటాయనటంలో సందేహం లేదు. ఎన్ని ఒత్తిళ్ళు ఎదురైనా తమ పట్టును నిరూపించుకున్నది టీడీపీ+కింజరాపు కుటుంబం. గడచిన 40 ఏళ్ళుగా కింజరాపు కుటుంబం చెప్పినట్లే ఏకగ్రీవాలైపోతోంది. అలాంటిది మొదటిసారి ఎన్నిక జరిగింది. 2778 ఓట్లకు 2022 పోలయ్యాయి. ఇందులో కింజరాపు సురేష్ కు 1857 ఓట్లు రాగా కింజరాపు అప్పలనాయుడుకు 157 ఓట్లొచ్చాయి. అంటే అచ్చెన్న కుటుంబం మద్దతు తెలిపిన అభ్యర్ధే గెలిచారు.

అయితే ఏకగ్రీవంతో అయిపోయేదాన్ని ఎన్నికల వరకు పట్టుకొచ్చిందంటు వైసీపీపై మండిపడటమే ఆశ్చర్యంగా ఉంది. ఒకవైపేమో ప్రతి పంచాయితిలోను నామినేషన్లు వేయించాలని, ఏ పంచాయితీని కూడా ఏకగ్రీవంగా వైసీపీకి అప్పగించద్దని చంద్రబాబునాయుడు పదే పదే నేతలను ఒత్తిడిచేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. దానికి తగ్గట్లుగానే అచ్చెన్న పంచాయితీ ఎన్నికల్లో వైసీపీని ఏకగ్రీవాలతో గెలవనిచ్చేది లేదని ప్రతిజ్ఞ కూడా చేశారు.

అంటే అచ్చెన్న మాటలు ఎలాగున్నాయంటే రాష్ట్రంలోని మిగిలిన అన్నీ పంచాయితీల్లో ఎన్నికలు జరగాలని తమ నిమ్మాడ పంచాయితి మాత్రం ఏకగ్రీవం కావాలన్నట్లుగా ఉంది. అసలు ఏకగ్రీవాలు వద్దు..ఎన్నికలే ముద్దంటు నినాదాలు చేస్తున్నదే చంద్రబాబు, స్టేట్ ఎలక్షన్ కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్. అలాంటిది తమ పార్టీ లైన్ కు భిన్నంగా అచ్చెన్న మాట్లాడటమే ఆశ్చర్యంగా ఉంది. హోరా హోరీ పోరులో కూడా తమ పంచాయితిలో పట్టు నిలుపుకున్నందుకు సంతోషించాల్సింది పోయి అచ్చెన్న ఎందుకింత బాధపడిపోతున్నారో అర్ధం కావటం లేదు.