ఇంకోసారి ఇలాంటి ప్రచారం చేస్తే ఖబడ్దార్..

తెలంగాణా రాష్ట్ర సమితి అంతర్గత వ్యవహారం చాలా విచిత్రంగా తయారైంది. ముఖ్యమంత్రిగా మంత్రి కేటీయార్ కు తొందరలోనే పట్టాభిషేకం అన్నారు. కేసీయార్ పదవిలో నుండి దిగిపోయి రాష్ట్ర సారధ్య బాధ్యతలు కేటీయార్ కు అప్పగించటానికి ముహూర్తం కూడా ఫిక్స్ అయిపోయింది అంటూ గడచిన రెండు నెలలుగా మీడియా ఒకటే ఊదరగొట్టింది. మీడియా అంతలా ఊదరగొట్టడానికి కారణం ఏమిటంటే అధికారపార్టీ నేతలే. అయితే ఎవరు ఊహించని విధంగా ఆదివారం నేతలతో సమీక్ష నిర్వహించిన కేసీయార్ ఒక్కసారిగా అందరినీ వాయించేశారు.

ఈనెల 18వ తేదీన కేటీయార్ సీఎంగా బాధ్యతలు తీసుకోబోతున్నారంటూ లీకులిచ్చింది అధికారపార్టీ నేతలే. కేటీయార్ ముఖ్యమంత్రి కావాలని, సీఎం అయితే తప్పేంటని, ముఖ్యమంత్రి పదవికి కేటీయార్ అన్నీ విధాల అర్హుడే అంటూ మంత్రులు, ఎంఎల్ఏలు, ఎంపిలు, నేతలు పోటీలుపడి మరీ ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. మంత్రులు, ఎంఎల్ఏలు, ఎంపిలు చేసిన ప్రకటనలన్నీ కేసీయార్ గమనిస్తునే ఉన్నారు. ఏ దశలో కూడా ఎవరినీ వారించినట్లుగా సమాచారం లేదు.

దానికితోడు కేటీయార్ కూడా ఖమ్మంకు వెళ్ళి జిల్లా నేతలతో సమావేశం అయినపుడు కూడా సీఎమ్మే జిల్లాకు వచ్చినంత హడావుడి జరిగింది. ఈనెల 17వ తేదీ కేసీయార్ జన్మదినమని మరుసటి రోజే అంటే 18వ తేదీనే కేటీయార్ కు పట్టాభిషేకమని పార్టీ నేతలే విస్తృతంగా ప్రచారంలోకి తెచ్చారు. జరుగుతున్న హడావుడి, ప్రచారం గురించి ఏనాడు కేసీయార్ పట్టించుకున్నట్లు లేదు. అలాంటిది మంత్రులు, ఎంఎల్ఏలు, ఎంపిలే కాకుండా వివిధ కార్పొరేషన్ల ఛైర్మన్లతో పార్టీ కార్యాక్రమంలో సమావేశం జరిగింది.

ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన కేసీయార్ అందరి అంచనాలకు విరుద్ధంగా విరుచుకుపడ్డారు. కేటీయారే తదుపరి సీఎం అని ప్రచారం చేసిన వాళ్ళందరినీ ఒకేసారి వాయించేశారు. మరో పదేళ్ళు తానే సీఎంగా ఉంటానని, తాను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నట్లు డైరెక్టుగానే చెప్పేశారు. ఇంకోసారి ఇలాంటి ప్రచారం చేస్తే ఖబడ్దార్ జాగ్రత్త అంటూ వార్నింగ్ కు ఇచ్చేశారు. సీఎం మార్పుపై ఎవరైనా మాట్లాడితే కర్ర కాల్చి వాతలు పెడతానని ఇచ్చిన వార్నింగ్ సంచలనంగా మారింది. కేసీయార్ వార్నింగుతో అందరికీ మతిపోయింది. కేటీయార్ ను కాబోయే సీఎంగా జరిగిన ప్రచారాన్ని కేసీయార్ ఎందుకు ఎలౌ చేశారు ? మళ్ళీ జరిగిన ప్రచారంపై ఎందుకు సీరియస్ అయ్యారో ఎవరికీ అర్ధం కావటం లేదు.