తొందరలోనే రోడ్లపై బాలయ్య విశ్వరూపం

ఇపుడు చేస్తున్న బోయపాటి శ్రీనివాస్ తో సినిమా అయిపోగానే తాను రోడ్డెక్కబోతున్నట్లు టీడీపీ నేత, హిందుపురం ఎంఎల్ఏ నందమూరి బాలకృష్ణ చెప్పారు. నెల్లూరు జిల్లా అభిమానులతో బాలయ్య ఫోన్లో చేసిన వ్యాఖ్యలు పార్టీలో సంచలనంగా మారింది. తాను రోడ్డెక్కగానే తన అసలు రూపం చూపిస్తానని చెప్పారు. మామూలుగా బాలయ్య మాట్లాడితేనే అర్ధమయ్యేది అంతంత మాత్రం. అలాంటిది రోడ్లపైకి వస్తా, అసలు అవతారం ఏమిటో చూపిస్తానని వార్నింగులు ఇస్తున్నారంటే ఏ అజెండా పెట్టుకున్నారో అర్ధం కావటంలేదు.

పైగా వైసీపీ ఇపుడు చేస్తున్నదానికి 100 రెట్లు చేసి చూపుదామని అనటం దేనికి సంకేతమో ఎవరికీ అర్ధం కావటం లేదు. వైసీపీ పాలనలో రాష్ట్రం రావణకాష్టంలాగ మారిపోయిందని సినిమా డైలాగ్ ఒకటి కొట్టేశారు. శ్రీరాముడికి 14 ఏళ్ళ వనవాసం ఎలాగో తనకు అంతే అని చెప్పిన డైలాగ్ అర్ధం ఏమిటో ఎవరికీ అర్ధంకాలేదు. ‘నేనేమిటో నా కెపాసిటి ఏమిటో అందరికీ చూపిస్తా’నని బాలయ్య భారీ డైలాగే చెప్పేశారు.

ఇంకా విచిత్రమేమిటంటే తాను అన్నింటికీ సిద్ధపడే మానసికంగా ప్రిపేర్ అవుతున్నట్లు చెప్పటం. దేనికైనా రెడీ అని ప్రాణత్యాగానికి కూడా తాను వెనకాడేది లేదని చెప్పటమేమిటో ఎవరికీ అర్ధం కావటంలేదు. ప్రజల కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధమే అంటూ చెప్పారు. ఇందుకు తాను మానసికంగా సిద్ధమవుతున్నారట. బాలయ్య ప్రాణత్యాగం చేయాల్సినంత అవసరం ఏమొచ్చిందో ఎవరికీ అర్ధం కాలేదు.

మొత్తానికి నందమూరి వంశాకురం అసందర్భంగా చేసిన వ్యాఖ్యలు, చెప్పిన మాటలు విన్న తర్వాత పార్టీ నేతలే ఆశ్చర్యపోతున్నారు. పైగా దేనికీ భయపడవద్దని ఇంతకాలం అయ్యిందేదో అయిపోయిందని దేన్ని ఉద్దశించి అన్నారో కూడా అభిమానులకు అర్ధం కావటం లేదు. మొత్తానికి మామూలుగానే బాలయ్య మాట్లాడేది ఎవరికీ అర్ధం కావటం లేదు. ఇక సినిమాలకు స్వస్తి చెప్పేసి పూర్తి సమయాన్ని రాజకీయాలకు, పార్టీ కార్యక్రమాలకే పరిమితమైపోతే నేతల రియాక్షన్ ఎలాగుంటుందో చూడాలి.