అమ‌రావ‌తి ఉద్య‌మానికి తికాయ‌త్ మ‌ద్ద‌తు.. వైసీపీకి తిప్పలు ?

రాజ‌ధాని అమ‌రావ‌తిని నిల‌బెట్టుకునేందుకు అక్క‌డి రైతులు, మ‌హిళ‌లు, యువ‌త‌, కూలీలు చేస్తున్న ఉ ద్య‌మం.. మ‌రింత హీటెక్క‌నుంది. జ‌గ‌న్ స‌ర్కారు ప్ర‌క‌టించిన మూడు రాజ‌ధానుల‌కు వ్య‌తిరేకంగా సాగు తున్న ఈ ఉద్య‌మం.. ఏడాది కాలం పూర్తి చేసుకున్న విష‌యం తెలిసిందే. అయిన‌ప్ప‌టికీ.. అదే దూకుడు, అదే డిమాండ్‌ను వినిపిస్తోంది. ఎట్టి ప‌రిస్థితిలోనూ మూడు రాజ‌ధానుల‌కు అనుమ‌తించేది లేద‌ని.. ఏకైక రాజ‌ధానిగా అమ‌రావ‌తినే కొన‌సాగించాల‌ని ఇక్క‌డి ప్ర‌జ‌లు డిమాండ్ చేస్తున్నారు. రాజ‌ధానిలో గ్రామ గ్రామానా వినిపిస్తున్న ఈ ఉద్య‌మ పిలుపు.. తాజాగా మ‌రో కీల‌క మ‌లుపు తిరుగుతోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

కేంద్ర ప్ర‌భుత్వం తీసుకువ‌చ్చిన‌ నూత‌న వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా ప్ర‌స్తుతం దేశ‌రాజ‌ధానిలో రైత‌న్న‌లు ఉద్య‌మాన్ని కొన‌సాగిస్తున్నారు. ఈ ఉద్య‌మాన్ని రాకేశ్‌ తికాయత్ ముందుండి న‌డిపిస్తున్నారు. ఈ క్ర‌మంలో ఇప్ప‌టి వ‌ర‌కు సాగిన ఉద్య‌మం.. ఒక విధంగా ఉంటే.. ఇప్పుడు మొద‌లైన‌రైతు ఉద్య‌మం .. కీల‌క మ‌లుపు దిశగా సాగుతోంది.

దేశంలోని ప్ర‌తి ఒక్క‌రినీ మ‌ద్ద‌తుగా కూడ‌గ‌ట్టుకుని తికాయ‌త్ సాగిస్తున్న ఉద్య‌మానికి ప్ర‌పంచ వ్యాప్తంగా కూడా అనేక గ‌ళాలు మ‌ద్ద‌తు ప్ర‌క‌టిస్తున్నాయి. ఒక‌ర‌కంగా చెప్పాలంటే.. తికాయ‌త్ ఈ ఉద్య‌మాన్ని ప్ర‌పంచ స్థాయికి తీసుకువెళ్లి.. మోడీ స‌ర్కారుకు చుక్క‌లు చూపిస్తున్నార‌నే చెప్పాలి.

ఈ నేప‌థ్యంలో ఇటీవ‌ల రాజ‌ధాని రైతు ఉద్య‌మ నాయ‌కులు.. మహిళా జేఏసీ, దళిత మహిళా జేఏసీ, యంగ్‌ ఫర్‌ యూత్‌ ప్రతినిధుల బృందం రాయపాటి శైలజ, వడ్డే అన్నపూర్ణ నాయకత్వంలో అమరావతి నుంచి బయలుదేరి వెళ్లి.. సింఘూ, టిక్రీ, ఘాజీపూర్‌ సరిహద్దుల్లోని రైతుల శిబిరాలను సందర్శించింది. ‘జై అమరావతి.. సేవ్‌ అమరావతి…జై ఆంధ్రప్రదేశ్‌’ అనే నినాదాలతో ఈ బృందం బ్యానర్లను ప్రదర్శిం చింది.

రైతు ప్రయోజనాలను దెబ్బతీసే నల్ల చట్టాలను తక్షణమే రద్దు చేయాలనీ, రైతుల సంక్షే మం, వారి ఆర్ధిక ప్రయోజనాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైనే ఉన్నదనీ స్పష్టం చేసింది. ఏపీలో రైతులకు జ‌గ‌న్‌ ప్రభుత్వం ద్రోహం తలపెట్టిందని రాయపాటి శైలజ, వడ్డే అన్నపూర్ణ వాపోయారు. ఈ విష‌యాన్ని తికాయ‌త్ దృష్టికి తీసుకువెళ్లారు.

అభివృద్ధిని నిలిపేసి అమరావతి నుంచి రాజధానిని తరలించేందుకు ఏపీ ప్రభుత్వం చేస్తున్న ప్ర‌య‌త్నాల‌ను, రైతుల‌పై ప్ర‌భుత్వం పెట్టిన కేసులు, నిర్బంధాలు, ఉద్యమం ఏడాదికి పైగా సాగిన విధానం వంటి కీల‌క ఘ‌ట్టాల‌ను, జ‌గ‌న్ స‌ర్కారు మొండిత‌నాన్ని..కూడా తికాయత్‌కు ఈ బృందం వివరించింది. ఆయా విషయాలను తికాయత్‌ శ్రద్ధగా ఆలకించారు. రాజధాని పరిరక్షణ కోసం చేస్తున్న ప్రయత్నాలను ఆయ‌న అభినందించారు.

రైతుల పోరాటంలో న్యాయం ఉన్నదని అభిప్రాయపడ్డారు. సాగు చట్టాల రద్దు ఉద్యమం తర్వాత అమరావతికి వస్తానని, ఉద్య‌మానికి తాము కూడా మ‌ద్ద‌తిస్తామ‌ని.. తికాయ‌త్ చెప్ప‌డం విశేషం. ఇదే జ‌రిగి.. తికాయ‌త్ క‌నుక అమ‌రావ‌తికి వ‌స్తే.. ఖ‌చ్చితంగా రైతు ఉద్య‌మం మ‌రింత జ‌ట్ స్పీడ్ పుంజుకోవ‌డం, జ‌గ‌న్‌కు చుక్క‌లు క‌నిపించ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.