అచ్చెన్న అరెస్టు !!

Atchannaidu Kinjarapu

తెలుగుదేశంపార్టీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడును పోలీసులు అరెస్టు చేశారు. కోటబొమ్మాళి పోలీసు స్టేషన్లో వైసీపీ నేతల ఫిర్యాదు ఆధారంగా పోలీసులు అచ్చెన్నను మంగళవారం అరెస్టు చేశారు. వైసీపీ తరపున పోటీ చేయాలని అనుకున్న కింజరాపు అప్పలనాయుడును అచ్చెన్న బెదిరించారని వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుపై విచారణ జరిపిన పోలీసులు సోమవారం కేసు నమోదు చేసుకున్నారు. మంగళవారం అరెస్టు చేశారు.

టెక్కలి నియోజకవర్గంలో నిమ్మాడ గ్రామం కింజరాపు స్వగ్రామం. దశాబ్దాలుగా ఈ గ్రామంలో కింజరాపు కుటుంబం చెప్పిందే వేదంలాగ సాగుతోంది. అలాంటిది కుటుంబంలో వచ్చిన విభేదాల కారణంగా అచ్చెన్న సోదరుడి కొడుకు అప్పలనాయుడు వైసీపీలో చేరారు. పంచాయితి ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేయాలని డిసైడ్ అయ్యారు. అయితే ఈ విషయం తెలుసుకున్న అచ్చెన్న ఫోనులో అప్పలనాయడుతో మాట్లాడారు. తర్వాత బెదిరించారు.

ఎన్నిరకాలుగా ప్రయత్నాలు చేసినా అప్పలనాయుడు లొంగకపోయేసరికి నామినేషన్ దాఖలు చేసే కార్యాలయం దగ్గర బాగా గొడవ చేశారు. నామినేషన్ పత్రాలను లాగేసుకోవాలని, అభ్యర్ధిని దూరంగా తీసుకెళిపోవాలని టీడీపీ నేతలు ప్రయత్నించారు. అయితే అక్కడ వైసీపీ నేతలు కూడా ఉండటంతో టీడీపీ నేతల ప్రయత్నాలు సాగలేదు. మొత్తానికి ఒకవైపు గొడవలు జరుగుతుండగానే మరోవైపు అప్పలనాయుడు నామినేషన్ వేశారు.

ఫోన్లో తనను బెదిరించటం, నామినేషన్ దాఖలు చేయకుండా అడ్డుకునేందుకు ప్రయత్నించారని అప్పలనాయుడు కోటబొమ్మాళి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అందుబాటులో ఉన్న వీడియో, ఆడియో సాక్ష్యాలను కూడా అభ్యర్ధి పోలీసులకు అందించారు. దాంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు అచ్చెన్నను అరెస్టు చేశారు.