మద్యం అమ్మకాల్లో కేసీఆర్ మాస్టర్ ప్లాన్

KCR

తెలంగాణలో మద్యం దుకాణాలు తెరవక తప్పని పరిస్థితి ఎందుకు వచ్చిందో కేసీఆర్ నిన్నటి ప్రెస్ మీట్లో చెప్పారు. తెలంగాణకు నలు వైపులా వేరే రాష్ట్రాల బార్డర్లు ఉన్నాయని.. ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల్లో మద్యం అమ్మకాలు మొదలవడంతో అక్కడి నుంచి తెలంగాణలోకి మద్యం వస్తోందని.. 80 శాతం ప్రాంతాలకు మద్యం అందుతోందని.. అలాంటపుడు తెలంగాణలో మద్యం దుకాణాలు మూసేయడంలో అర్థం లేదని ఆయన చెప్పారు.

గత రెండు రోజుల్లో తెలంగాణ సరిహద్దులు దాటి అవతలకి వెళ్లి జనాలు మద్యం తెచ్చుకున్న మాట వాస్తవం. రెండు రోజుల కిందట ఏపీలో మద్యం దుకాణాలు ఆరంభిస్తే.. తమిళనాడు నుంచి చిత్తూరు జిల్లాకు పెద్ద ఎత్తున మందుబాబులు పోటెత్తడం తెలిసిన సంగతే. ఐతే కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో ఇతర రాష్ట్రాల నుంచి ఇప్పుడు తెలంగాణకు మందుబాబులు పెద్ద ఎత్తున వచ్చే అవకాశం కనిపిస్తోంది.

ఏపీలో మద్యపానం పట్ల నిరాసక్తత పెంచే కారణం చూపించి ఏకంగా 75 శాతం మద్యం ధరలు పెంచేశారు. ఇది దారుణం అంటున్న వారి మాటను వినిపించుకునేవారు లేదు. ఐతే తెలంగాణలో కూడా మద్యం ధరలు పెంచినప్పటికీ.. అవి ఏపీతో పోలిస్తే తక్కువ మోతాదే. చీప్ లిక్కర్ మీద 11 శాతం.. మిగతా మద్యం మీద 16 శాతం ధరలు పెంచారు. దీంతో ఏపీ జనాలు తెలంగాణ సరిహద్దులు దాటి మద్యం కోసం ఇటు వైపు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. పైగా ఏపీలో ఊరూ పేరూ లేని చీప్ బ్రాండ్స్ అమ్ముతున్నారు.

పేరున్న బ్రాండ్లేవీ కనిపించడం లేదు. అందుకోసం కూడా ఏపీ వాళ్లు తెలంగాణకు వచ్చే అవకాశముంది. అంతర్ రాష్ట్ర సరిహద్దుల్లో రాకపోకలపై సడలింపులు వచ్చాక మందు కోసమే చాలామంది అటు నుంచి ఇటొచ్చే అవకాశముంది. ధరలు స్వల్పంగా పెంచడం ద్వారా లాక్ డౌన్ తర్వాత కూడా అవి కొనసాగించడానికి కేసీఆర్ ప్లాన్ చేశారు. ఈ విషయాన్ని ప్రెస్ మీట్లో కూడా స్పష్టం చేశారు. ఏపీలో తర్వాత ఏ మేర ధరలు తగ్గిస్తారో కానీ.. ఆ రాష్ట్రంతో పోల్చుకుని మన దగ్గర చాలా నయం అని మందుబాబులు సులువుగానే కొత్త ధరలతో సర్దుకుపోతారు. ప్రభుత్వం పట్ల పెద్దగా వ్యతిరేకత కూడా ఉండదు.