తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల నుంచి బీఆర్ఎస్ సభ్యులను సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సెషన్ మొత్తం వారిపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ క్రమంలోనే తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మాక్ అసెంబ్లీ నిర్వహిస్తున్నారు. ఈ మాక్ అసెంబ్లీలో కాంగ్రెస్ సభ్యులుగా బీఆర్ఎస్ సభ్యులు వ్యవహరించారు. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి స్థానంలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సభాధ్యక్షుడిగా ప్రసంగించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ సర్కార్ పై తలసాని సెటైర్లు వేశారు.
ఈ మాక్ అసెంబ్లీలో ప్రజా సమస్యలపై బీఆర్ఎస్ సభ్యులు సభలో ప్లకార్డులు ప్రదర్శించారు. అయితే, 100 రోజుల్లో హామీలు అమలు చేస్తామని చెప్పిన మాట వాస్తవమేనని, కానీ, ఏ 100 రోజుల్లో అనే సంగతి చెప్పలేదని తలసాని సెటైర్లు వేశారు. ఐదేళ్లు కాదని, పాతికేళ్లు తామే అధికారంలో ఉంటామని అన్నారు. ఎప్పుడో ఒకప్పుడు హామీలు అమలు చేస్తామని, నిర్దిష్ట సమయం ఏదీ లేదని వ్యగ్యాస్త్రాలు సంధించారు. సభలో సభ్యులు సబ్జెక్ట్ తప్ప ఏమైనా మాట్లాడుకోవచ్చని చురకలంటించారు.
ఇక, తనకు చాలా సమస్యలున్నాయని, ఢిల్లీతో సమస్య, పార్టీలో సమస్య.. ఆఖరికి బీఆర్ఎస్తో కూడా ప్రశాంతత లేదని రేవంత్ రెడ్డిని ఉద్దేశించి తలసాని సెటైర్లు వేశారు. ఇక, ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో ఒకటైన కాళేశ్వరం ప్రాజెక్టును ఇందిరాగాంధీ నిర్మించారని తలసాని చెప్పడంతో సభ్యులంతా పగలబడి నవ్వారు. 100 రోజుల్లో హామీల అమలు అంటూ ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చామని కాంగ్రెస్ పార్టీపై పంచులు వేశారు. జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు శాసన సభ స్పీకర్గా వ్యవహరించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates