గుంటూరు మేయర్ సీటు ఎవరికి

రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మక స్థానాల్లో గుంటూరు మేయర్ స్థానం ఒకటి. విజయవాడ, గుంటూరు కార్పొరేషన్లు అమరావతి రాజధాని పరిసరాల్లో ఉండటంతో ఇక్కడ గెలుపు సాధించడం కూటమి, వైసీపీలకు చాలా అవసరం. గుంటూరులో ఎవరు గెలిస్తే వారి వైపే అమరావతి ప్రజల మద్దతు వుందని చెప్పుకునే అవకాశం ఉంటుంది. గత సాధారణ ఎన్నికల్లో అమరావతి ప్రాంతంలోని అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలన్నిటిని టీడీపీ గెలిచింది. ఇప్పుడు కార్పొరేషన్లో ఆ పట్టును కొనసాగించాలని పట్టుదలగా వుంది. దీనికి తగ్గట్టు మేయర్ పదవికి టీడీపీలో పోటీ తీవ్రంగా వుంది. వైసీపీ సైతం గత కార్పొరేషన్లో సాధించిన స్థానాలు నిలుపుకునేందుకు ప్లాన్ చేస్తుంది.

కార్పొరేషన్ ఎన్నికల ప్రక్రియ అధికారికంగా ఇంకా స్టార్ట్ కాలేదు. కానీ ఈ స్థానాన్ని ముస్లింలకు ఇవ్వాలని టీడీపీ ప్రధమికంగా నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతుంది. గతంలో కూడా టీడీపీ ఇక్కడ ఇదే పాలసీ అమలు చేసింది. అదే పాలసీని కొనసాగించాలన్న వ్యూహంలో వున్నట్లు ప్రచారం జరుగుతుంది. ప్రస్తుత డిప్యూటీ మేయర్ సజీలకు మేయర్ సీటు ఇవ్వాలన్న యోచనలో చంద్రబాబు వున్నట్లు చెప్పుకుంటున్నారు. షౌకత్ కూతురైన సజీల కుటుంబానికి గుంటూరులో మంచి పట్టుంది. వైసీపీ తరుపున 7 వ డివిజన్ నుంచి గెలుపొందిన ఆమె అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీడీపీలో చేరారు. ప్రస్తుతం క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు.

ముస్లిం మైనారిటీలకు కాకుండా కాపులకు సీటు ఇవ్వాలనుకుంటే సీనియర్ నాయకుడు, ఎమ్మెల్యే కన్నా లక్ష్మి నారాయణ కుమారులు నాగరాజు, ఫణింద్రల్లో ఒకరికి ఇచ్చే అవకాశాన్ని కొట్టిపారేయలేమని చెబుతున్నారు. కన్నాకు గుంటూరులో మంచి పట్టుంది. ముస్లింలలో కూడా ఆయనకు అనుచరులున్నారు. నాగరాజు కు ఒకసారి మేయర్ గా చేసిన అనుభవం కూడా వుంది. పైగా కాపులకు ప్రాధాన్యత ఇచ్చినట్లవుతుందని అధిష్టానాం అలోచిస్తున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుత కార్పొరేషన్లో ఫ్లోర్ లీడర్ గా వ్యవహరించిన కోవెలమూడి రవీంద్ర ఉరఫ్ నాని పేరు కూడా రేసులో బాగా వినిపిస్తుంది. పార్టీ కష్టకాలంలో గట్టిగా నిలబడిన నానికి న్యాయం చేయాలని పార్టీ శ్రేణులు కోరుతున్నారు. పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య పేరు కూడా వినిపిస్తున్నప్పటికి చంద్రబాబు సుముఖంగా వున్నారో లేదో తెలియడం లేదని చెబుతున్నారు.

ఇక వైసీపీ కూడా గుంటూరు కార్పొరేషన్ ఎన్నికలను సీరియస్ గానే తీసుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. గత ఎన్నికల్లో కార్పొరేషన్ ను కైవసం చేసుకున్న అనుభవంతో మళ్ళీ పాగా వేయాలని ఎత్తులు వేస్తుంది. అయితే అభ్యర్థి ఎంపికలో ఎటూ తేల్చుకోలేక సతమతం అవుతుంది. నిన్నా మొన్నటి వరకు మేయర్ గా చేసిన కావటి మనోహర్ నాయుడికి బాగా ప్రాధాన్యత ఇచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో చిలకలూరిపేట నుంచి పోటీ చేసే అవకాశం ఇచ్చింది. అయినప్పటికీ ఆయన 2024 ఎన్నికల్లో పార్టీ ఓటమి తర్వాత సైలెంట్ మోడ్ లోకి వెళ్ళిపోయారు. దాంతో వైసీపీ కొత్త అభ్యర్థి వేటలో పడింది. కూటమి ప్రభుత్వం మీద ప్రజల్లో వ్యతిరేకత వుందని అంచనా వేస్తున్న వైసీపీ దానిమీద ఆశలు పెట్టుకుంది.

కూటమి పార్టీ తరుపున బీజేపీ కూడా ఈ సీటు మీద ఆశలు పెట్టుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. సింగిల్ గా పోటీ చేసి గెలిచే అవకాశం ఏమాత్రం లేకపోయినప్పటికీ టీడీపీ, జనసేన కు వున్న బలం మీద ఆధారపడి నెగ్గుకొని రావాలని ఆలోచిస్తుంది. వైసీపీ మాజీ మేయర్ కావటి మనోహర్ నాయుడు బీజేపీలో చేరేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయనకు సీటు ఇవ్వాలని చూస్తుంది. అయితే మనోహర్ నాయుడు బీజేపీలో చేరేందుకు టీడీపీ, జనసేన నాయకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఒకవేళ ఆయన బీజేపీ లో చేరి పోటీ చేస్తే కూటమి నాయకుల నుంచి తగిన సహకారం లభించే అవకాశం లేదని చెప్పుకుంటున్నారు. అయినా గుంటూరు లాంటి కీలకమైన స్థానాన్ని టీడీపీ వదులుకునే ప్రసక్తే లేదని చర్చ జరుగుతుంది.