బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలకు ఘోర అవమానం?

తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల తొలిరోజే తీవ్ర ఉద్రిక్తత వాతావరణం ఏర్పడిన సంగతి తెలిసిందే. నల్ల దుస్తులతో అసెంబ్లీకి వచ్చిన బీఆర్‌ఎస్‌ నేతలను పోలీసులు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో పోలీసులు తన చీర లాగేశారని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి కన్నీటి పర్యంతమయ్యారు.

తన చీర లాగడం బాధ కలిగించిందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో మహిళా సభ్యులకే రక్షణ లేకపోతే రాష్ట్రంలోని మహిళలకు ఏం రక్షణ ఉంటుందని ఆమె ప్రశ్నించారు. పోలీసులు ఇష్టం వచ్చినట్లు చేతులు పట్టుకొని లాగారని, కింద పడేసి తొక్కారని ఆరోపించారు. తన కాలికి గాయమైందని, తన చీర లాగిన ఘటనపై ఫిర్యాదు చేస్తానని, వారిపై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.

మరోవైపు, ఈ తోపుటాల సందర్భంగా మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి జుట్టు పట్టుకొని పోలీసులు అమానుషంగా ప్రవర్తించారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. అసెంబ్లీకి రమ్మని సవాల్ విసరుతారని, కానీ, తాము అసెంబ్లీకి వస్తే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామన్న భయంతోనే అడ్డుకుంటున్నారని సబితా ఇంద్రారెడ్డి మండిపడ్డారు. బీఆర్‌ఎస్‌ నేతలు ఆరోపించారు. ప్రజా సమస్యలపై మాట్లాడేందుకు తమకు అవకాశం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

ఈ క్రమంలోనే పోలీసులపై కేటీఆర్, మాజీ మంత్రి తలసాని నిప్పులు చెరిగారు. ఈ రకంగా మహిళలను అవమానిస్తారా అంటూ పోలీసులపై కేటీఆర్ మండిపడ్డారు. అధికారం ఎల్లకాలం కాంగ్రెస్ దగ్గర ఉండదని, హద్దు మీరిన పోలీసులపై భవిష్యత్తులో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కేటీఆర్ వార్నింగ్ ఇచ్చారు.