`కోటి ఇళ్లు` చుట్టేశారు.. స‌రే.. ల‌క్ష్యం నెరవేరిన‌ట్టేనా?!

`ఇంటింటికీ టీడీపీ` పేరుతో ఏపీ అధికార కూట‌మి పార్టీ టీడీపీ చేప‌ట్టిన కార్య‌క్ర‌మం స‌రికొత్త రికార్డును సొంతం చేసుకుంది. మ‌రో వారం రోజుల్లో ముగియ‌నున్న ఈ కార్య‌క్ర‌మంలో ఇప్ప‌టి వ‌ర‌కు పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు.. కార్య‌కర్త‌లు, నాయ‌కులు కోటి మంది ఇళ్ల‌కు వెళ్లి .. ప్ర‌జ‌ల‌ను ప‌ల‌క‌రించిన‌ట్టుగా పార్టీ అధికారికంగా ప్ర‌క‌టించింది. త‌ద్వారా కూట‌మి స‌ర్కారు గ్రాఫ్ పెరిగిన‌ట్టు వివ‌రించింది. ఇది వినూత్న కార్య‌క్ర‌మమ‌ని, రికార్డు సొంత‌మైంద‌ని పేర్కొంది.

ఇక టీడీపీ జాతీయ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ కూడా కోటి ఇళ్ల‌కు త‌మ్ముళ్లు తిరిగి రావ‌డం ప‌ట్ల హ‌ర్షం వ్య‌క్తం చేశారు. ఇది పార్టీ చ‌రిత్ర‌లోనే స‌రికొత్త రికార్డుగా ఆయ‌న పేర్కొన్నారు. కేవ‌లం 38 రోజుల్లో కోటి మంది ఇళ్ల‌కు వెళ్లి ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న సంక్షేమ కార్య‌క్ర‌మాలు, తెచ్చిన‌, తెస్తున్న పెట్టుబడులు, త‌ద్వారా జ‌రగ‌బోయే ఉపాధి క‌ల్పన ఉద్యోగాలు వంటివాటిని స‌మ‌గ్రంగా వివ‌రించార‌ని ఆయ‌న హ‌ర్షం వ్య‌క్తం చేశారు.

ల‌క్ష్యం నెర‌వేరిందా?

ఇంటింటికీ టీడీపీ కార్య‌క్ర‌మం ద్వారా కోటి ఇళ్ల‌కు పార్టీ నాయ‌కులు వెళ్లారు బాగానే ఉంది. మ‌రి దీని తాలూకు ల‌క్ష్యం నెర‌వేరిందా? అనేది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌. ఈ కార్య‌క్ర‌మం రూప‌క‌ల్ప‌న స‌మ‌యంలోనే భారీ ల‌క్ష్యాన్ని ఏర్పాటు చేశారు. వాటిని సాధించాల‌ని నిర్ణ‌యించారు. మ‌రి ఈ 38 రోజుల్లో ఇళ్ల‌కు తిర‌గ‌డమే ప్రామాణికంగా భావిస్తే.. ల‌క్ష్యం నెర‌వేరింద‌ని భావించ‌వ‌చ్చు. కానీ, `అస‌లు ల‌క్ష్యం` ప్రామాణిక‌మ‌ని భావిస్తే.. ల‌క్ష్యం స‌గం కూడా పూర్తికాలేద‌న్న‌ది వాస్త‌వం. సో.. ఈ విష‌యంపై పార్టీ ఆత్మ‌విచారం చేసుకోవాలి.

ఇవీ అస‌లు ల‌క్ష్యాలు!

1) ప్ర‌జ‌ల‌కు స‌మ‌గ్ర వివ‌ర‌ణ ఇవ్వ‌డం.

2) సంక్షేమం అమ‌లు కాలేద‌న్న అసంతృప్తితో ఉన్న కుటుంబాల‌కు స్వాంత‌న ప‌ర‌చ‌డం.

3) ప్ర‌తి ఇంటికీ వెళ్లి ఆయా కుటుంబ స‌భ్యుల‌తో 10 నిమిషాలు కేటాయించి మాట్లాడాలి. త‌ద్వారా వారి సాధ‌క బాధ‌లు.. స‌ర్కారుపై అభిప్రాయం తెలుసుకోవాలి.

4) కూట‌మి పార్టీల మ‌ధ్య ఐక్య‌త‌కు పెద్ద‌పీట వేయాలి. అంద‌రూ క‌ల‌సి క‌ట్టుగా ఈ క‌ర్య‌క్ర‌మంలో పాల్గొనాలి.

5) వైసీపీ వ‌ర్సెస్ కూట‌మి స‌ర్కారుకు మ‌ధ్య ఉన్న తేడాను ప్ర‌జ‌ల‌కు వివ‌రించాలి.

ఇప్ప‌టి వ‌ర‌కు ఏం జ‌రిగింది?

1) అస‌లు ల‌క్ష్యానికి భిన్నంగా.. కొన్ని చోట్ల ఇంటింటికీ వెళ్ల‌డం అంటే.. కేవ‌లం త‌లుపు కొట్టి క‌ర‌ప‌త్రాల పంపిణీకే ప‌రిమితం అయ్యారు.

2) కూట‌మి నాయ‌కులు కొంతమంది క‌లివిడిగా వ్య‌వ‌హ‌రించ‌లేద‌న్న‌ది వాస్త‌వం.

3) చాలా చోట్ల ప్రజా సమస్యలు తెలుసుకోలేదన్నది విశ్లేషకులు చెబుతున్న మాట.

4) కేవ‌లం స్వోత్క‌ర్ష‌లు, మెప్పుల‌ను మాత్ర‌మే ప్ర‌చారంలోకి తెచ్చారు.