ప్రయాణికుల సౌకర్యానికి ఏపీఎస్ ఆర్టీసీ మరో వినూత్న సేవను అందుబాటులోకి తీసుకొచ్చింది. విజయవాడలో ‘హోమ్ పికప్’ సదుపాయాన్ని పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించింది. ఇక బస్టాండ్కు వెళ్లేందుకు ఆటోలు, ఇతర వాహనాలు వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా.. ముందుగా రిజర్వేషన్ చేసుకుంటే ఆర్టీసీ బస్సే ప్రయాణికుల ఇంటి వద్దకు వచ్చి పికప్ చేసుకునే సౌకర్యం కల్పిస్తోంది.
ప్రస్తుతం విజయవాడ–హైదరాబాద్ మార్గంలో ఈ సేవను ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. ఒకే ప్రాంతానికి చెందిన కనీసం ఆరుగురు ప్రయాణికులు టికెట్లు రిజర్వ్ చేసుకుంటే, వారి ఇంటి వద్దకు బస్సును పంపించి ప్రయాణికులను పికప్ చేస్తారు. బస్టాండ్ దూరాన్ని బట్టి ఇందుకోసం స్వల్ప రుసుము వసూలు చేయనున్నారు.
ఈ సదుపాయాన్ని పొందాలనుకునే ప్రయాణికులు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల మధ్య, బస్సు బయలుదేరడానికి కనీసం నాలుగు గంటల ముందుగా టికెట్ రిజర్వ్ చేసుకోవాలి. కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి ప్రయాణించే వారికి ఈ సేవ మరింత ఉపయోగకరంగా ఉండనుంది.
ముఖ్యంగా భారీ లగేజీతో బస్టాండ్కు చేరుకునే ఇబ్బందులు తగ్గనున్నాయి. విజయవాడలో ప్రయోగాత్మకంగా ప్రారంభించిన ఈ ‘హోమ్ పికప్’ సేవకు ప్రయాణికుల నుంచి వచ్చే స్పందన ఆధారంగా భవిష్యత్తులో మరింత విస్తరించే అవకాశం ఉంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates
