తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను పుట్టింటి నుంచి బలవం తంగా పంపేశారని ఆమె ఆరోపించారు. అయితే.. ఆ సమయంలో తనను అత్తింటి వారు కడుపులో పెట్టుకుని చూసుకున్నారని అన్నారు. తను ఎదుర్కొన్న బాధలు ఏ బిడ్డా ఎదుర్కోకూడదని తాను కోరుకుంటున్నట్టు తెలిపారు. నిజామాబాద్లో నిర్వహించిన `పాంచజన్య సంకల్ప సభ`లో ఆమె ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఈ సందర్భంగా కవిత కన్నీరు పెట్టుకున్నారు.
తెలంగాణ రక్షణ సేన పార్టీని ప్రకటించిన సమయంలో `పాంచజన్య` పేరుతో ఐదు కీలక పథకాలను ఆమె ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వాటికి సంబంధించిన అంశాలను వివరించేందుకు నిజామాబాద్లో సోమవారం సభ పెట్టారు. ఈ క్రమంలో ఆమె తన తండ్రి మాజీ సీఎం కేసీఆర్ గురించి.. మాజీ మంత్రుల గురించి వివరించారు. ఇదేసమయంలో తన ఇంట్లో తనను ఎలా ఇబ్బందులు పెట్టారో పేర్కొంటూ కన్నీరు పెట్టుకున్నారు. కాగా, పార్టీ తరపున నిజామాబాద్ జిల్లాలో నిర్వహించిన తొలి బహిరంగ సభ ఇదే కావడం గమనార్హం.
ఈ సభలో కవిత మాట్లాడుతూ.. “నేను పిరికిదాన్ని కాదు.. నేనేంటో మీకు తెలుసు” అంటూ ప్రజలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. తన తండ్రి కెసిఆర్ కు, తనకు మధ్య విభేదాలు రావడానికి మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి ముఖ్య కారణమని ఆరోపించారు. జీవితంలో ఆయనను క్షమించనని ఆగ్రహం వ్యక్తం చేశారు. అత్తింటి అండ ఉండడం వల్లే ఈ రోజు తాను సొంతంగా పార్టీ పెట్టుకునే పరిస్థితి వచ్చిందని తెలంగాణ సమస్యలపై స్పందించే అవకాశం వచ్చిందని పేర్కొన్నారు. ప్రజలకు కడ వరకు అండగా ఉంటానని పేర్కొన్నారు. తనను పుట్టింటి వాళ్లు దూరం పెట్టారని.. వ్యాఖ్యానించారు.
మెట్టినిల్లయిన నిజామాబాద్ నుంచి తాను ఎంపీగా విజయం దక్కించుకున్నానని గుర్తు చేశారు. ఇక్కడి ప్రజలు తనను ఎప్పుడూ అక్కున చేర్చుకున్నారని తెలిపారు. భవిష్యత్ ప్రణాళికను ఈ సందర్భంగా కవిత వివరించారు బీసీలకు 50% రిజర్వేషన్లు అమలు చేయాల్సిందేనని తేల్చి చెప్పారు. సగానికి పైగా జనాభా ఉన్న బీసీలకు అన్యాయం జరిగే తాను చూస్తూ.. ఊరుకునేది లేదన్నారు. సామాజిక న్యాయం లక్ష్యంగా నిజామాబాద్ వేదికగా ఆమె రాజకీయ రోడ్మ్యాప్ను ప్రకటించారు. తాను ప్రజల కోసమే పార్టీ పెట్టానని వ్యాఖ్యానించారు. ఉద్యమకారులను గౌరవించడంతోపాటు.. వారికి ఉద్యోగాలు కూడా ఇచ్చే బాధ్యతతీసుకుంటామన్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates
