కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పూర్తి చేసి.. తాజాగా ప్రారంభించిన వెలిగొండ ప్రాజెక్టుకు సుమారు 50 సంవత్సరాలకు పైగానే చరిత్ర ఉందని స్థానికులు చెబుతున్నారు. దాదాపు 50 ఏళ్ల కిందట.. పూల సబ్బయ్య అనే నాయకుడి హయాంలో ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని ఫ్లోరైడ్ బాధితుల కష్టాలు తీర్చేందుకు, అదేసమయంలో కరువు ప్రభావిత ప్రాంతాలకు.. నీరు పారించాలన్న లక్ష్యంతో ఈ ఉద్యమం ప్రారంభమైందని గుర్తు చేసుకుంటున్నారు. ఆ విశేషాలు ఇవీ..
పశ్చిమ ప్రకాశం ప్రాంతంలో తీవ్ర కరవు, ఫ్లోరైడ్ మహమ్మారితో ఏటా వందల మంది మృత్యువాత పడేవారు. అదేసమయంలో కుటుంబాలకు కుటుంబాలు వలసపోయేవి. ఈ సమయంలో కృష్ణా జలాలను ఈ ప్రాంతానికి తరలించడమే ఏకైక మార్గమని మాజీ ఎమ్మెల్యే పూల సుబ్బయ్య బలంగా నమ్మి, 1975-76లో పెద్ద ఎత్తున ఉద్యమాలు, పాదయాత్రలు చేపట్టారు. 1989లో ప్రముఖ ఇంజనీర్ డాక్టర్ కుడితపూడి శ్రీరామకృష్ణయ్య నివేదికల ఆధారంగా దీనికి తొలి రూపం వచ్చింది.
అయితే.. అప్పటి వరకు ఉన్న ప్రభుత్వాలు.. ఈ ప్రాజెక్టు చాలా కష్టసాధ్యమని పేర్కొని పక్కన పెట్టాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు1996 మార్చి 5న ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. 1999లో మొదటి దశ పనులకు పరిపాలనా అనుమతులు లభించాయి. అనంతరం ఆయన ప్రభుత్వం పడిపోయి కాంగ్రెస్ సర్కారు వచ్చింది. దీంతో `జలయజ్ఞం` పేరుతో తిరిగి దీనిని ప్రారంభించారు.
రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ప్రాజెక్టును ‘జలయజ్ఞం’ పథకం కిందికి చేర్చి నిధులు విడుదల చేశారు. ఈ ప్రాజెక్ట్ సాధన కోసం కృషి చేసిన పూల సుబ్బయ్య గుర్తుగా దీనికి “పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు” అని పేరు ఖరారు చేశారు. ప్రాజెక్టు సాంకేతిక నిర్మాణం విషయానికి వస్తే.. వెలిగొండ ప్రాజెక్టు దేశంలోనే అత్యంత సంక్లిష్టమైన నీటి రవాణా వ్యవస్థలలో ఒకటిగా నిలిచింది.
నాగార్జునసాగర్ టైగర్ రిజర్వ్ (నల్లమల అడవులు) గుండా టన్నెల్ బోరింగ్ మిషన్ల సహాయంతో సొరంగాలు తవ్వడం దీని ప్రత్యేకత. శ్రీశైలం జలాశయం ముందు భాగంలోని కొల్లం వాగు నుంచి వరద నీటిని ఈ ప్రాజెక్టుకు తరలిస్తారు. రెండు సొరంగాల ద్వారా(ఇదే బాగా ఆలస్యమైంది. ఒక దశలో మిషన్ ఇరుక్కుపోయింది): నల్లమల కొండలను దాటించడానికి విదేశీ పరిజ్ఞానాన్ని వినియోగించారు.
ఇవీ ప్రత్యేకతలు..
+ సొరంగం-1 : 18.82 కిలో.మీటర్ల పొడవు, 7 మీటర్ల వ్యాసం.
+ సొరంగం-2 : 18.78 కి.మీ పొడవు, 9.2 మీటర్ల వ్యాసం.
+ ఈ సొరంగాల గుండా వచ్చే నీరు 21.8 కిలో.మీటర్ల పొడవైన ఫీడర్ కాలువ ద్వారా సుంకేశుల, గొట్టిపడియ, కాకర్ల కొండల మధ్య నిర్మించిన నల్లమల సాగర్ రిజర్వాయర్కు చేరుతుంది.
+ 1996 లో ప్రారంభమైనప్పుడు ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం కేవలం రూ. 980 కోట్లు
+ కాలక్రమేణా పనుల ఆలస్యం, సొరంగాల తవ్వకంలో సాంకేతిక ఇబ్బందులతో మొదటి దశ పూర్తి కావడానికి సుమారు రూ.10,000 కోట్లకు పైగా ఖర్చయింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates
