జగన్ సర్కారును గట్టిగా ఏసుకున్న పవన్

ఆంధ్రప్రదేశ్‌లో మద్యం దుకాణాల్ని మళ్లీ తెరవడంతో నిన్న ఎంత రచ్చ జరిగిందో తెలిసిందే. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి కానీ ఏపీలో మాత్రం భయానక దృశ్యాలు కనిపించాయి. అసలేమాత్రం జనాలపై నియంత్రణ కనిపించలేదు. సోషల్ డిస్టెన్స్ లేదు. మాస్కుల్లేవు. ఒకే చోట వందలు, వేలమంది గుమిగూడి ఒకరినొకరు తోసుకుంటూ కనిపిస్తున్న దృశ్యాలు కరోనా విషయంలో జనాల్ని కంగారు పెట్టేస్తున్నాయి.

దీనికి తోడు మద్యం దుకాణాల వద్ద జనాల్ని నియంత్రించే డ్యూటీలకు ఉపాధ్యాయుల్ని వేయడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. దీనిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం జగన్ సర్కారును నిలదీశాడు. భర్త తాగొచ్చి తన్నడంతో భార్య, కుమార్తె చనిపోయిన వార్తను షేర్ చేస్తూ.. ఏపీలో మద్యం దుకాణాలు తెరుచుకోవడం పట్ల ఇలాంటి దారుణాలు జరగడం బాధాకరమని పవన్ అన్నాడు.

ఇక ఉపాధ్యాయులకు మద్యం దుకాణాల వద్ద డ్యూటీ వేశారన్న వార్తను షేర్ చేస్తూ.. మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ బతికుండా ఇలాంటివి చూస్తే ఎలా స్పందించేవాడో అని పవన్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఇలాంటివి గురువుల నైతిక స్థైర్యాన్ని దెబ్బ తీస్తాయని పవన్ అన్నాడు.

ఇక మద్యం దుకాణాల వద్ద జనసందోహం నెలకొన్న వీడియోలను షేర్ చేసిన పవన్.. ఎన్నికలకు ముందు మద్య నిషేధం చేస్తామని జగన్ సర్కారు హామీ ఇచ్చిందని.. ఈ లాక్ డౌన్ టైంలో నిషేధాన్ని గట్టిగా అమలు చేయడానికి మంచి అవకాశం ఉందని.. కానీ ఆ మార్గాన్ని ఎంచుకోకుండా ఆదాయం కోసమని మద్యం దుకాణాలు మళ్లీ తెరించిందని పవన్ విమర్శించాడు. ఎక్కడా సోషల్ డిస్టన్స్ అన్నదే లేదని.. దేవాలయాలు, మసీదులు, చర్చిలను కరోనా భయంతో మూసి వేసి.. లిక్కర్ షాపులు మాత్రం తెరవడంలో ఆంతర్యమేంటని పనవ్ ప్రశ్నించాడు.