మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలోనూ మతమార్పిడులను ప్రోత్సహించారని, హిందువులకు ఆయన చేసిందేమీ లేదని మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. అందుకే రాష్ట్రంలో మతపరమైన వివాదాలు తలెత్తుతున్నా జగన్ స్పందించడం లేదని వ్యాఖ్యానించారు. “జగన్ కూడా ఆయన హయాంలో మతమార్పిడులను ప్రోత్సహించారు. హిందువులకు ఏం చేయలేదు. అందుకే ఆయన కూడా స్పందించడం లేదు” అని విజయసాయిరెడ్డి అన్నారు.
క్రైస్తవ కుటుంబానికి చెందిన వైఎస్ కుటుంబానికి సుదీర్ఘకాలం నమ్మిన బంటుగా పనిచేసిన విజయసాయిరెడ్డి.. ఇప్పుడు వారితో దూరం ఏర్పడిన తర్వాత హిందూత్వవాద రాజకీయాలు చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఏపీలో పెద్దగా ప్రభావం లేని హిందూ–ముస్లిం, లవ్ జిహాద్ వంటి అంశాలను తెరపైకి తీసుకువచ్చి రాజకీయంగా లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తున్నారని ప్రత్యర్థులు విమర్శిస్తున్నారు.
చంద్రబాబు నాయుడు ఐదేళ్లకోసారి రాజకీయ పొత్తు పెట్టుకుంటారని విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. సాదిక్ వివాదంపై చర్యలు తీసుకుంటే 2029 ఎన్నికల్లో కాంగ్రెస్ అవసరం రావచ్చన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం మౌనం వహిస్తోందని ఆరోపించారు.
కేంద్ర బీజేపీ భేష్.. రాష్ట్ర బీజేపీపై అసంతృప్తి!
మతమార్పిడులు, మతపరమైన వివాదాల విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని విజయసాయిరెడ్డి ప్రశంసించగా, రాష్ట్ర బీజేపీ నాయకత్వంపై మాత్రం తీవ్ర విమర్శలు చేశారు. కేంద్ర బీజేపీ సూపర్.. రాష్ట్ర బీజేపీ స్లీపర్ అంటూ వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్లోనూ ఉత్తరప్రదేశ్ తరహాలో కఠిన చర్యలు, పర్యవేక్షణ అవసరమని అభిప్రాయపడ్డారు.
రాజకీయంగా తన భవిష్యత్పై త్వరలో నిర్ణయం వెల్లడిస్తానని విజయసాయిరెడ్డి తెలిపారు. “బయటకు చెప్పుకోలేక కుమిలి కుమిలి ఏడవాల్సి వస్తోంది. జగన్మోహన్రెడ్డి ఒక అసమర్థ ప్రతిపక్ష నాయకుడు. పార్టీ ప్రకటనపై త్వరలోనే నా నిర్ణయం వెల్లడిస్తాను. నాకు ఎవరిపైనా ద్వేషం లేదు, శత్రుత్వమూ లేదు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు” అని ఆయన వ్యాఖ్యానించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates