కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే కూటమిని బలోపేతం చేసేందుకు.. రాబోయే రోజుల్లో మరింత ఐక్యంగా ముందుకు సాగేలా వ్యూహాత్మక అడుగులు వేయించే దిశగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దృష్టి పెట్టారు. ఈ క్రమంలో ఎన్డీయే కూటమి పార్టీలను ముందుకు నడిపించేందుకు, సమన్వయం చేసేందుకు `కన్వీనర్`పదవిని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. తాజాగా దీనికి సంబంధించి ప్రధాని పచ్చజెండా ఊపినట్టు ఎన్డీయే పక్షాల నాయకులు చెబుతున్నారు.
జాతీయ ప్రజాస్వామ్య కూటమి(ఎన్డీఏ) కూటమి వాజపేయి హయాం నుంచే ఉంది. 2014 నుంచి కూడా ఎన్డీయే కూటమిగానే బీజేపీ అధికారంలోకి వచ్చింది. అయితే.. అప్పట్లో కూటమిగా ముందుకు వెళ్లినా.. బీజేపీ కి పూర్తిస్థాయి మెజారిటీ దక్కింది. అయినప్పటికీ.. 2014లో టీడీపీ సహా.. మిత్రపక్షాలకు కేంద్రంలో పదవులు లభించాయి. ఇక, 2019లోనూ ఎన్డీయే గానే బీజేపీ ఎన్నికలకు వెళ్లి విజయం దక్కించుకుంది. ఆ సమయంలోనూ మెజారిటీ సీట్లు వచ్చాయి. ఇక, అప్పటి ఎన్డీయేలో టీడీపీ విభేదించి బయటకు వచ్చింది.
ఇక, 2024లో మాత్రం బీజేపీ పరిస్తితి ఎన్డీయే మిత్రపక్షాలపై ఆధారపడాల్సి వచ్చింది. ముఖ్యంగా ఉత్తరాదిలో బీజేపీ కి సీట్లు తగ్గుతున్న నేపథ్యంలో దక్షిణాదిలోని మిత్రపక్షాలను మరింత మచ్చిక చేసుకునే పని ప్రారంభించింది. ఇక, వచ్చే ఎన్నికల నాటికి ఎన్డీయేను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఏర్పడింది. కాక్రోచ్ జనతా పార్టీ ఎఫెక్ట్తో జన్ జీ ఓటు బ్యాంకు కీలకంగా మారింది. ఈ విషయంలో ప్రాంతీయ పార్టీలను ముఖ్యంగా మిత్రపక్షాలను మరింత ఎక్కువగా ఆదరించాల్సిన అవసరం ఏర్పడింది.
ఈ నేపథ్యంలో తాజాగా ఎన్డీయే కూటమిని బలోపేతం చేయడం, నాయకులు, పార్టీలను సమన్వయం చేయడం లక్ష్యంగా కన్వీనర్ పోస్టును భర్తీ చేయాలని ప్రధాని నిర్ణయించారు. కూటమి పార్టీల నేతల అభిప్రాయాలపై సానుకూలంగా స్పందించిన ప్రధాని మోడీ.. కన్వీనర్ నియామకానికి గ్రీన్సిగ్నల్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో గతంలో ఎన్డీయే కన్వీనర్ గా పనిచేసిన ఏపీ సీఎం చంద్రబాబు కే ఈసారి కూడా పదవి దక్కే అవకాశం ఉందని ఢిల్లీ వర్గాలు భావిస్తున్నాయి. ఒకవేళ ఆయన కాదంటే.. బీహార్ మాజీ సీఎం నితీష్కుమార్ ను నియమించే అవకాశం ఉందని తెలుస్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates